CP Avinash Mahanthi | సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): సైబర్క్రైమ్ బాధితులకు స్థానిక పోలీస్స్టేషన్లో ఉండే సైబర్ వారియర్స్ అండగా నిలిచి.. వారికి కావాల్సిన సహకారాన్ని అందించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు. ఆయా పోలీస్స్టేషన్లలోని సైబర్ వారియర్స్కు కొత్త నంబర్తో కూడిన సెల్ఫోన్లను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయం నుంచి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ.. సైబర్ నేరాలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని, వాటిని ఎక్కడికక్కడే కట్టడి చేస్తూ మోసాల బారిన పడిన బాధితులకు వేగంగా సేవలందించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకు సైబర్ వారియర్లు కూడా మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు.
సైబర్ బాధితులకు ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియదని, స్టేషన్లో ఉండే వారియర్స్ ప్రత్యేకంగా సైబర్ బాధితులకు సంబంధించిన సమస్యలపై వెంటనే స్పందించాలన్నారు. సైబర్ క్రైమ్ బ్యూరో అందించిన ప్రత్యేక నంబర్లకు బాధితులు ఫోన్ చేయగానే స్పందిస్తూ.. వారికి తగిన మార్గనిర్దేశం చేయాలన్నారు. బాధితులకు 1930, సైబర్క్రైమ్.జీవోవి.ఇన్కు ఫిర్యాదు చేయించడం, వారి ఫిర్యాదు స్టేటస్ గూర్చి వివరించడం, ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేసే బాదితులను సంప్రదించి.. వారికి కావాల్సిన సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్క్రైమ్స్ ఇన్చార్జి డీసీపీ నర్సింహ, ఏసీపీ రవీందర్రెడ్డి, ఇన్స్పెక్టర్లు రమేశ్, రవి, నరేందర్, శంకర్రెడ్డి, అజయ్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.