సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): ‘హలో డా.సుషాంత్ గారా.. మేము కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నాం.. మీకు కొరియర్ ద్వారా గోల్డ్ ఆర్నమెంట్స్ వచ్చాయి.. కస్టమ్స్ డ్యూటీ చెల్లించి వాటిని తీసుకెళ్లండి’… అంటూ ఫోన్కాల్స్ వచ్చాయా.. తస్మాత్ జాగ్రత్తా. అవి కచ్చితంగా మోసపూరితమైన కాల్స్ అని గ్రహించండి. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో అమాయకులను మోసం చేస్తున్నారు. స్నేహం ముసుగులో బహుమతుల పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ శాతం విద్యావంతులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, సంపన్న వర్గాలు, ప్రజా ప్రతినిధులు, ఐటీ నిపుణులు ఉంటున్నారని నగర సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు.
నగరానికి చెందిన ఒక యువతికి ఇన్స్టాగ్రామ్లో ఆస్కార్ లియాన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. నమ్మకం కుదిరిన తరువాత స్నేహానికి చిహ్నంగా ఒక ఖరీదైన గిఫ్ట్ పంపుతున్నానని యువతిని నమ్మించాడు. అంతర్జాతీయ కొరియర్ ద్వారా గిఫ్ట్ వస్తుందని, దానికి సంబంధించి కొంత పన్ను కస్టమ్స్ వారికి చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు. అతడు చెప్పినట్లే యువతికి ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను కస్టమ్స్ అధికారినని, మీ పేరుతో కొరియర్లో కొన్ని ఖరీదైన గిఫ్ట్లు వచ్చాయని, పన్ను చెల్లించి గిఫ్ట్లను తీసుకోవాలని సూచించాడు. నమ్మిన బాధిత యువతి గుర్తు తెలియని వ్యక్తి చెప్పినట్లుగా దఫ దఫాలుగా రూ.2,23,950లు ఆయా ఖాతాలకు బదిలీ చేసింది. ఆ తర్వాత ఎలాంటి గిఫ్ట్లు రాకపోగా వచ్చిన ఫోన్స్కు తిరిగి కాల్ చేస్తే అవి పనిచేయలేవు. బాధితురాలు నగర సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఒక గుర్తుతెలియని వ్యక్తి నగరంలోని ఒక యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆ యువతి రిక్వెస్ట్ను అంగీకరించడంతో కొన్ని రోజుల పాటు చాటింగ్ చేసిన వ్యక్తి స్నేహం పేరుతో వాట్సాప్ నంబర్ పంపి మరింత దగ్గరయ్యాడు. మీకు యూకే నుంచి ఖరీదైన నగలు, డైమండ్ చెవి దిద్దులు, ఐఫోన్, ల్యాప్టాప్, షూస్ తదితర బహుమతులు పంపుతున్నట్లు నమ్మించాడు. కొన్ని పన్నులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. అంతలోనే ఒక మహిళ ఫోన్ చేసి, ఢిల్లీ కస్టమ్స్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పింది. మీకు కొన్ని ఖరీదైన బహుమతులు వచ్చాయి.. వాటికి సంబంధించిన ట్యాక్స్లు చెల్లించాలంటూ చెప్పి.. బాధిత యువతి నుంచి దఫదఫాలుగా రూ.1.22 కోట్లు ఆన్లైన్ ద్వారా దోచుకున్నారు. గిఫ్ట్లు రాకపోవడంతో బాధిత యువతి నగర సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
ఇతర నేరాలతో పోల్చితే ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. బాధాకరమైన విషయమేమంటే ఈ నేరాల బారిన ఎక్కువగా విద్యావంతులే పడుతున్నారు. దురాశతో బహుమతులకు ఆకర్శితులై ఆర్థికంగా మోసపోతున్నారు. మరికొంత మంది యువకులు గుర్తుతెలియని యువతుల నుంచి వచ్చే కాల్స్కు ఆకర్శితులై బ్లాక్మెయిల్కు గురవుతున్నారు. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చాలా కేసుల్లో యువతుల గొంతుతో మాట్లాడే వారు అమ్మాయిలు కాదని తేలింది. ప్రత్యేక యాప్ల ద్వారా స్వరాన్ని మార్చి యువతుల స్వరంతో అమాయక యువకులకు వల వేస్తున్నారు. అధికారులమంటూ చెప్పి.. అరెస్ట్ చేస్తామని వచ్చే కాల్స్ను అస్సలు నమ్మవద్దు. ఏదైనా కొరియర్ వస్తే నేరుగా మీ ఇంటికి వస్తుంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్కాల్స్, పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.