చెల్లింపు కోసం ఇచ్చిన చెక్కును ఆపేందుకు గూగుల్ సెర్చ్లో బ్యాంక్ కాల్ సెంటర్ నెంబరు కోసం గాలించి ఓ వ్యాపారి 2.12 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్ మాయగాళ్లు కూడా మొదట ఫోన్ను కట్ చేసి, ఆ తర్వాత ఫోన్ చేసి ఈ తతంగాన్ని నడిపారు. ఫిర్యాదులో బాధితుడు తెలిపిన ప్రకారం, కూకట్పల్లి భరత్నగర్కు చెందిన ఓ వ్యాపారి ఒక ప్రైవేటు సంస్థ చెల్లింపు కోసం ప్రైవేటు బ్యాంక్ చెక్కును ఇచ్చాడు. అయితే, ఆ చెక్కును డ్రా చేయకుండా ఆపేందుకు గూగుల్ సెర్చ్లో ప్రైవేటు బ్యాంక్ కస్టమర్ కేర్ నెం. కోసం వెదికాడు. అయితే ఓ నెం. లభించింది. దానికి ఫోన్ చేయగానే వారు ఫోన్ను కట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్గా మాట్లాడుతున్నట్లు చెప్పాడు. మీరు ఇచ్చిన చెక్కు డ్రా కాకుండా ఉండాలంటే మేము పంపించే లింక్లో వివరాలను నింపాలని చెప్పారు. మంకీ సర్వే పేరుతో ఓ లింక్ను పంపారు. అందులో వివరాలు ఎంట్రీ చేయగానే బాధితుడి ఫోన్ నెంబరుకు 2.12 లక్షలు విత్ డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. మోసపూరితంగా తన ఖాతాను ఖాళీ చేశారని బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.