ఖైరతాబాద్, జూన్ 11 : సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఈసారి ఏకంగా ఏఎస్ఐనే బురిడీ కొట్టించారు. ఒకే ఒక్క క్లిక్ సదరు పోలీసు అధికారి ఖాతాలో నుంచి డబ్బులు మాయమయ్యాయి. పంజాగుట్ట ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం….పంజాగుట్ట ఠాణాలో ఏఎస్ఐగా పనిచేస్తున్న నర్సయ్యకు ఈ-చలాన్ పేరుతో ఓ ఏపీకే ఫైల్ వాట్సాప్లో వచ్చింది. అది మోసపూరితమైందని భావించకుండా క్లిక్ చేశారు. దీంతో క్షణాల్లోనే ఆయన ఖాతా నుంచి రూ.49,139 మాయమయ్యాయి. ఆలస్యంగా గ్రహించిన నర్సయ్య తన ఖాతాలో డబ్బులు తగ్గినట్లు గుర్తించి.. తక్షణమే 1930కు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.