అకౌంట్ టేకోవర్ చేసి నిధులు మళ్లించుకున్న సైబర్ చీటర్స్
సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ) : నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్(ఎన్ఈసీఎల్) ఖాతాను సైబర్నేరగాళ్లు టేకోవర్ చేసి రూ.64 లక్షలు బురిడీ కొట్టించారు. బుధవారం సంస్థ ప్రతినిధులు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్ఈసీఎల్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో వివిధ ప్రాజెక్టులు చేస్తూ ఆయా దేశాల్లోని సంస్థలు, బ్యాంకులతో లావాదేవీలు నిర్వహిస్తుంటుంది. ఆయా లావాదేవీలు, ఒప్పందాలకు సంబంధించిన ఈమెయిల్స్ ద్వారాఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఐస్ల్యాండ్లో ఉన్న సినర్జీ ఓపియన్ సంస్థతోను ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ, ఆయా వ్యవహారాలకు సంబంధించిన ఈమెయిల్స్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తున్నారు.
ఈ సంస్థ మెయిల్ను హ్యాక్ చేసి, ఎన్ఈసీఎల్తో జరుగుతున్న సంభాషణలను సైబర్నేరగాళ్లు గుర్తించారు. సినర్జీ సంస్థకు పంపించాల్సిన డబ్బుల విషయంలో చర్చ జరుగుతున్నది. ఇంతలోనే సైబర్నేరగాళ్లు సినర్జీ కంపెనీని పోలినట్లు మరొక ఈమెయిల్ ఐడీని ఒక అక్షరం తేడాతో తయారు చేసి, ఎన్ఈసీఎల్ సంస్థకు పంపించారు. రెగ్యులర్గా వాడే ఖాతా సమస్య వచ్చిందని లండన్లోని రివోల్ట్ బ్యాంక్లో ఉన్న కొత్త ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేయాలని సినర్జీ కంపెనీ పంపించినట్లు నకిలీ ఈమెయిల్ను ఎన్ఈసీఎల్కు పంపించారు. అది నిజమని నమ్మి ఎన్ఈసీఎల్ సంస్థ 79441.20 యూరోలు (రూ.64 లక్షలు) లండన్ ఖాతాకు బదిలీ చేశారు. అయితే సినర్జీ కంపెనీకి రావాల్సిన డబ్బురాకపోవడంతో ఇటీవల ఫోన్ చేసి వాకబు చేశారు. తాము డబ్బు డిపాజిట్ చేశామని ఎన్ఈసీఎల్ కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నైజీరియన్ల పనిగా అనుమానిస్తూ ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.