సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. అమాయకులను ఆసరాగా చేసుకొని వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. స్మా ర్ట్ ఫోన్ ఉంది కదా అని అనుకోకుండా ఏదైనా లింక్ నొ క్కితే చాలు.. ఇక అంతే. అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు. దీనికి తోడు ఏమాత్రం అనుమానం రాకుండా వివిధ బ్యాంకులు, రుణసంస్థల నుంచి చేస్తున్నట్లు నమ్మబలికి తీరా తమవైపునకు లాగేస్తూ.. ఎంచక్కా డబ్బులు మా యం చేస్తున్నారు. వరుస సంఘటనలతో పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. శుక్రవారం మరో మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల ఫేస్బుక్లను హ్యాక్ చేసిన మాదిరిగానే.. ఇప్పుడు కొత్తగా వాట్సాప్లను హ్యాక్ చేస్తున్నారు.
ఈ నెల 18న ఓ వ్యక్తికి 8102903690 నుంచి జియో ఇంటర్నెట్ నుంచి కాల్ చేస్తున్నామని ఫోన్ చేశారు.
ఫోన్కు ఓటీపీ వచ్చిందని.. అది తమకు చెప్పాలని కోరారు. బాధితుడు బదులిచ్చాడు.
దీంతో తన వాట్సాప్ ఖాతా నుంచి తనకు ప్రమేయం లేకుండానే స్నేహితుల నంబర్లకు రూ.10 వేలు కావాలని సందేశాలు వెళ్లాయి.
వెంటనే స్పందించిన తన స్నేహితులు రూ.10వేలు పంపించి మోసపోయారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కుత్బుల్లాపూర్ చెందిన ఓ వ్యక్తికి మీ ఫోన్ నంబర్కు రూ.15 వేలు రుణ సౌకర్యం ఉందని ఓ యాప్నకు సంబంధించిన మెస్సేజ్ వచ్చింది.
దీంతో ఆ లింక్ క్లిక్ చేసిన బాధితుడు యాక్టివేట్ చేసుకున్నాడు. అయితే అతడికి తెలియకుండానే రూ.12,497 డెబిట్ అయిన్నట్లు సందేశం వచ్చింది.
వెంటనే సంబంధిత కాల్సెంటర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. సాంకేతిక కారణంగా జరిగిందని చెప్పారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఐ ఫోన్ రిపేర్ కోసం ఓ వ్యక్తి ఈ నెల 22న గూగుల్లో సెర్చ్ చేశాడు.
అందులో ఉన్న ఓ నంబర్కు ఫోన్ చేసి ఏజెంట్తో మాట్లాడాడు.
అందుకు ఫోన్ పే ద్వారా రూ.10 తాను పంపించే లింక్ ద్వారా పంపించాలని తెలుపగా.. బాధితుడు రూ.10 పంపించాడు.
వెంటనే అతడి ఖాతాలో నుంచి మొదటి దఫా రూ.4,998, రెండవ దఫా రూ.9,987 డెబిట్ అయ్యాయి.
దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
కరోనా నుంచి ఏవిధంగానైతే కాపాడుకోవడానికి మాస్కును ధరిస్తూ తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారో, అదే మాదిరిగా అపరిచిత వ్యక్తుల మాయలో పడి మీ ఖాతాలో ఉన్న డబ్బులను పోగొట్టుకోవద్దు. అవసరం లేని లింక్లు క్లిక్ చేయకూడదు. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ చెప్పకూడదు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. – ఎస్.రమేశ్, ఇన్స్పెక్టర్, పేట్బషీరాబాద్