బాలానగర్, నవంబర్ 5 : సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆన్లైన్లో ఫోన్ బుక్ చేయడం కోసం ప్రయత్నించి నాలుగు సార్లు అకౌంట్ నుంచి నగదు పోగొట్టుకొని ఓ యువతి మోసపోయింది. ఈ సంఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిరోజ్గూడలో నివాసముంటున్న వింజమూరి మౌనిక ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి. ఈనెల 3వ తేదీన ఆన్లైన్లో ఫోన్ బుక్ చేయడం కోసం బజాజ్ ఫైనాన్స్లో నగదు పే చేసింది. అయినప్పటికీ ఫోన్ బుక్ అయినట్లు ఎలాంటి సమాచారం రాలేదు.
దీంతో ఆమె గూగుల్లో బజాజ్ ఫైనాన్స్ కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేసింది. అనంతరం ఆమెకు ఓ గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. మోబిక్విక్ బజాజ్ ఫైనాన్స్ వాలెట్ అను అప్లికేషన్ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో చెప్పిన విధంగానే మోబి క్విక్ బజాజ్ ఫైనాన్స్ వాలెట్ను మౌనిక డౌన్లోడ్ చేసి, అందులో తమ డెబిట్ కార్డ్ నుంచి రూ. ఐదువేలు పే చేయాలని సూచించారు. ఈ మేరకు మౌనిక రూ.ఐదు వేలు పే చేయడం కోసం ప్రయత్నించగా ఓటీపీ వచ్చింది. సదరు ఓటీపీ ఎంటర్ చేయగానే అకౌంట్ నుంచి రూ. 20,354 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. రెండోసారి ప్రయత్నించగా మరో రూ. రెండు వేలు డెబిట్ అయ్యాయి. మూడోసారి రూ. 800లు డెబిట్ అయ్యాయి. దీంతో మొత్తం రూ. 23, 154 అకౌంట్ నుంచి డెబిట్ కావడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన మౌనిక బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఎండీ వహీదుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.