సిటీబ్యూరో, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): సైబర్ మోసగాళ్లు సరికొత్త చీటింగ్ను తెరపైకి తెచ్చారు. ఇప్పటి వరకు అనేక రకాలుగా మోసం చేస్తున్న సైబర్ మాయగాళ్లు తాజాగా 3 నిమిషాల వీడియో చూస్తే రూ.40లు వస్తాయని ఆశ పుట్టిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇలాంటి ప్రకటన మోజులో పడి దాదాపు రూ.6.31 లక్షలు పోగొట్టుకున్నాడు. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న ముంబయికి చెందిన స్టాఫ్వేర్ ఉద్యోగి తన స్నేహితుల ద్వారా http//: gau.busepro.comలో రిజిస్టరై ఎజౌయిక్(ezoic ads. app)ను డౌన్లోడ్ చేసుకుని అందులో మూడు నిమిషాల నిడివి గల ప్రకటనను చూస్తే రూ.40లు వస్తాయని తెలుసుకున్నాడు.
దీంతో తన అప్పులు తీరిపోతాయని భా వించి రూ.1000 కట్టి ఆ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యాడు. అనంతరం ప్రకటనల యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇంతలో అతడికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ.2 లక్షలు కట్టి వీఐపీ మెంబర్ కింద చేరితే దాదాపు 200 వీడియోలు చూడటంతో పాటు కట్టిన డబ్బుల్లోంచి రూ.1.90 లక్షలు వాపస్ వస్తాయని ఆశ పుట్టించాడు. దీంతో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి మొత్తం రూ.6.31లక్షలు చెల్లించాడు. ఎంతకీ అతడికి డబ్బులు వాపస్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.