సిటీబ్యూరో, సెప్టెంబరు 20(నమస్తే తెలంగాణ): బిల్లు చెల్లించలేదంటూ.. సరఫరా నిలిచిపోతుందని విశ్రాంత ఉద్యోగికి కంగారు పెట్టించి.. సైబర్ నేరగాళ్లు నగదు దోచేశారు. నగరానికి చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను టీఎస్పీడీసీఎల్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని.. ‘మీరు కరెంట్ బిల్లు కట్టలేదు. సరఫరా వెంటనే నిలిచిపోతుంద’ని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన బాధితుడు ఆగంతకుడు చెప్పినట్లు తన ఫోన్లో క్విక్ సపోర్టు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. సైబర్ మోసగాడు మాటల్లో పెట్టి బ్యాంక్ ఖాతాలు, యూపీఐ ఐడీ వివరాలు, ఓటీపీలు తెలుసుకుని రూ. 5 లక్షలు కొట్టేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్20: చింతల్లోని న్యూవివేకానందనగర్ కాలనీకి చెందిన రమేశ్(32) ఈ నెల 28న ఇండస్బ్యాంకు డెబిట్కార్డు సమస్యపై గూగుల్లోని కస్టమర్ కేర్ను సంప్రదించాడు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఓ కాల్ వచ్చింది. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, తాము పంపించే లింక్లను ఓపెన్ చేసి వివరాలను అందించాలని సూచించారు. రమేశ్ వారు చెప్పినట్లు చేయగానే.. ఖాతా నుంచి రూ.1.26 లక్షలు మాయమయ్యాయి. బాధితుడు జీడిమెట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజు తెలిపారు.