సిటీబ్యూరో, సెప్టెంబరు 15(నమస్తే తెలంగాణ): లక్కీ డ్రాలో ఖరీదైన కారును గెలిచారంటూ.. సైబర్ ముఠా ఓ మహిళా ఖాతాకు ఎసరు పెట్టింది. ఏకంగా రూ. 27 లక్షలు దోచేసింది. మల్కాజిగిరికి చెందిన మహిళ ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది. ఇటీవల ఆమె ఈ కామర్స్ వెబ్సైట్లో షాపింగ్ చేసింది. కొద్దిసేపటికే ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీకు షాప్ క్లూస్ లక్కీ డ్రాలో రూ. 14 లక్షల విలువైన కారును గెల్చుకున్నారని చెప్పాడు. ఆ కారు పొందాలంటే… ప్రాసెసింగ్ ఫీజలు చెల్లించాలంటూ.. డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఇలా వారం రోజుల్లో రూ. 27 లక్షలు తస్కరించాడు. ఇంకా డబ్బులు పంపాలని చెప్పడంతో అనుమానించిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పులు తీసుకొచ్చి.. డబ్బులు చెల్లించినట్లు వాపోయింది. దర్యాప్తులో భాగంగా సదరు మహిళ నుంచి తస్కరించిన నగదు ముంబై, ఢిల్లీని పలు ప్రైవేటు బ్యాంకులకు బదిలీ అయినట్లు గుర్తించారు. బాధితురాలికి వచ్చిన ఫోన్ లొకేషన్ కోల్కత్తా నుంచి వచ్చినట్లు గుర్తించారు.