సిటీబ్యూరో, సెప్టెంబరు 8(నమస్తే తెలంగాణ): ఓ కళాశాల ఆన్లైన్ జూమ్ క్లాసుల్లో చొరబడిన ఆగంతకుడు.. ఓ విద్యార్థినిని లైంగికదాడి చేస్తానని బెదిరిస్తూ.. మెసేజ్ పెట్టడం కలవర పాటుకు గురిచేసింది. అంతేకాదు.. పలువురికి అసభ్యకరమైన సందేశాలు పంపించి వేధించాడు. దీంతో అతడిని పట్టుకోవాలంటూ…కళాశాల యాజమాన్యం రాచకొండ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే… నాచారంలోని ఓ పేరొందిన కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ఆన్లైన్లో జూమ్ ద్వారా తరగతులను నిర్వహిస్తున్నది. ఇందుకు సంబంధించిన పాస్వార్డ్ను విద్యార్థులకు ఇచ్చింది. గత నెలలో ఇలా ఆన్లైన్ పాఠాలు నిర్వహిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి ఓ విద్యార్థిని పేరును పేర్కొంటూ.. ఆమెను అత్యాచారం చేస్తానని మెసేజ్ పెట్టాడు. అంతేకాకుండా పలువురికి అసభ్య సందేశాలు కూడా పెడుతుండటంతో నిర్వాహకులు మరుసటి రోజు పాస్వర్డును మార్చారు. అయినా అతడు ఆ కళాశాల టీచర్ మెయిల్ను హ్యాక్ చేసి.. వాటి ద్వారా చాలా మందికి అసభ్యకరమైన మెసేజ్లు పంపాడు. ఆ టీచర్ వరస్ట్ అంటూ.. బాధితురాలి ఫోన్ నంబర్తోనే ఆమెకే మెసేజ్లను పంపిస్తూ.. వేధించాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ..ప్రిన్సిపాల్ రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నది.