సిటీబ్యూరో, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): లైవ్ స్ట్రీమింగ్లో అసభ్య సంభాషణకు అలవాటుపడిన ఓ యువకుడు డబ్బులు పోగొట్టుకున్నాడు. వాటిని అధిగమించేందుకు దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నాడు. డ్రగ్స్..బిట్ కాయిన్లను తక్కువ ధరకు ఇస్తానని ఎర వేసి… చివరకు పోలీసులకు చిక్కాడు. సహకరించిన స్నేహితుడు సైతం కటకటలాపాలయ్యాడు. కర్ణాటకకు చెందిన శ్రీధర్కు లైవ్ స్ట్రీమింగ్లో పలువురు మోడల్స్, సినీ ఆర్టిస్ట్లతో అభ్యంతకరంగా మాట్లాడే అలవాటు ఉంది.
అలా మాట్లాడాలంటే ముందుగా లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించే వెబ్సైట్కు కొంత డబ్బు చెల్లించాలి. ఆ డబ్బు చెల్లించిన తర్వాత ఆ వెబ్సైట్ నిర్వాహకులు కొన్ని కాయిన్లు ఇస్తారు. వాటికి సంబంధించిన వివరాలను లైవ్ స్ట్రీమింగ్లో పేర్కొంటే.. వాటి ఆధారంగా ఎంత సేపు మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలనే సమాచారం తెలుసుకొని..ఆ లైవ్ స్ట్రీమింగ్లో ఉండే మోడల్స్, ఆర్టిస్ట్లు కనెక్షన్ను ఎనేబుల్ చేసి మాట్లాడుతారు.
ఇలా ఆ యువకుడు ఈ లైవ్ స్ట్రీమింగ్కు అలవాటు పడి దాదాపు రూ. 15 లక్షలు పొగొట్టుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు రావడంతో దాని నుంచి గట్టెక్కేందుకు దోపిడీకి స్కెచ్ వేశాడు. తన స్నేహితుడి రామకృష్ణతో కలిసి సోషల్ మీడియాలో పరిచయమైన ఫ్రెండ్స్కు ఫోన్ చేసి.. ‘నా దగ్గర డ్రగ్స్ ఉన్నాయి. వాటిని తక్కువ ధరకు ఇస్తా.. మీరు ఎక్కువ రేటుకు అమ్ముకుని లాభాల పొందవచ్చ’ని ప్రచారం చేసుకున్నాడు. అంతేకాకుండా బిట్కాయిన్లు కూడా ఉన్నాయని, వాటిని కూడా తక్కువ రేటుకు ఇస్తానని.. మీరు డబ్బులు చెల్లిస్తే..వాటిని మీ ఖాతాకు బదిలీ చేస్తానని నమ్మించేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలో ఉండే ఓ వ్యక్తి సంప్రదించగా, తన వద్ద కోటి రూపాయలు విలువ చేసే డ్రగ్స్, బిట్కాయిన్లు ఉన్నాయని, 50 లక్షలు తీసుకురమ్మని శ్రీధర్ చెప్పాడు. దీంతో సదరు వ్యక్తి కర్నాటకలోని రాయ్చూర్కు వెళ్లాగా, తొలుత డబ్బులు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని అతడిని శ్రీధర్, రామకృష్ణ బెదిరించారు. బాధితుడు అక్కడి నుంచి తప్పించుకొని.. సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీస్ అధికారులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి..రిమాండ్కు పంపించారు.