సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): సైబర్ మోసాలు.. నేరాలపై మాట్లాడుకోండి.. ఇంట్లో చర్చించండి.. స్మార్ట్ ఫోన్లు ఉన్నవారంతా సైబర్ క్రైం గురించి తెలుసుకోండి.. లేదంటే, అవగాహన లేకుండా చేస్తున్న చిన్న పొరపాటుతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని సైబర్ క్రైం పోలీసులంటున్నారు. సాధారణ నేరాలకంటే 70 శాతం సైబర్ నేరాలు పెరిగాయంటున్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తే చిన్న పొరపాట్లతోనే చాలా మంది అమాయకులు లక్షలు పోగొట్టుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులు సరికొత్తగా ‘సైబర్ చర్చా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్స్, కాలేజీలు, కార్పొరేట్ సంస్థలు, అపార్ట్మెంట్లు, కాలనీ సంఘాలు.. ఇలా అనేక వేదికలపై ఈ సైబర్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ చర్చ ద్వారా జరుగుతున్న మోసాలు, నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచనున్నారు. ఇందుకు సైబర్ క్రైం పోలీసులు పీఎస్లలో నమోదవుతున్న కేసుల అంశాలను ఈ చర్చా కార్యక్రమంలో చర్చించనున్నారు. ఇప్పటికే సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు 100 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి.. వారు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు.. వాటిని ఎలా నియంత్రించాలి.. వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఈ సైబర్ యోధులు వారు పొందిన శిక్షణను మరో ముగ్గురికి.. వారు మరో ముగ్గురికి ఇవ్వనున్నారు. ఈ చైన్ను పెంచుకుంటూ కమిషనరేట్ పరిధిలోని ప్రతి ఒక్కరికీ సైబర్ నేరాలపై అవగాహన పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ప్రణాళికలను రూపొందించారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కావాలని పోలీసులు కోరుతున్నారు. అవగాహన పెంచుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించి, సైబర్ నేరాలను కట్టడి చేయడంలో సహాయం అందించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.