సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): ఈ మెయిల్ హ్యాక్ చేసి, స్నేహితుడి మాదిరిగా అత్యవసరంగా డబ్బు అవసరముందంటూ ఓ సైబర్నేరగాడు నగరవాసికి రూ.3.75 లక్షలు టోకరా వేశాడు. మారేడ్పల్లిలో నివాసముండే మోజెస్కు, అమెరికాలో జన్హత్మన్ అనే స్నేహితుడున్నాడు. ఇటీవల మోజెస్కు, హత్మన్ పంపించినట్లు ఒక ఈ మెయిల్ వచ్చింది. ‘భారత్లో ఉంటున్న మా బంధువులకు అత్యవసరంగా డబ్బులు అవసరమున్నాయి, నేను ఇక్కడి నుంచి పంపే వరకు ఆలస్యమవుతోంది.. వెంటనే ఫలానా బ్యాంకు ఖాతాకు డబ్బులు వేయమని’ దాని సారాంశం.
ఇది నిజమని నమ్మిన మోజెస్ మూడు దఫాలుగా రూ.3.75 లక్షలను సదరు బ్యాంకు ఖాతాకు పంపాడు. ఆ తర్వాత ఫోన్ చేసి డబ్బులు ముట్టాయా అని అడుగగా స్నేహితుడి చెప్పిన సమాధానంతో బిత్తరపోయిన మోజెస్ సోమవారం సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే సాధారణంగా మెయిల్ స్ఫూపింగ్తో సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతుంటారని.. ఈ కేసులో ఈ మెయిల్ను హ్యాక్ చేసినట్లు నిర్ధారణ అయ్యిందని సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
రాంకోఠిలో ఉండే దీపక్ తన సిమ్ను పోర్ట్ పెట్టి జియో నుంచి బీఎస్ఎన్ఎల్కు మార్చాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తి బీఎస్ఎన్ఎల్ నుంచి మాట్లాడుతునున్నాని చెప్పి.. కేవైసీకి చెందిన డాక్యుమెంట్లు పంపలేదని.. వెంటనే అప్డేట్ చేయకపోతే సిమ్ బ్లాక్ అవుతుందంటూ నమ్మించాడు. అలా జరగొద్దంటే తాము చెప్పినట్లు చేయాలని చెప్పి దీపక్తో ఆటోమేటిక్ ఎస్ఎంఎస్ సెండర్ యాప్ను డౌన్లోడ్ చేయించాడు. ఈ తర్వాత రూ.19 రూపాయలు రీచార్జి చేయాలంటూ బ్యాంక్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అయితే ఎస్ఎంఎస్ సెండర్ యాప్లో సైబర్నేరగాళ్లు చెప్పిన నెంబర్ ఫీడ్ చేయడం.. బ్యాంకు లావాదేవీలకు చెందిన ఓటీపీలు బదిలీ కాగా.. దీంతో దీపక్ ఖాతాలో ఉన్న రూ.1.4 లక్షలను సైబర్ నేరగాళ్లు ఖాళీ చేశారు.