ఖైరతాబాద్, మే 18 : ప్రభుత్వ ఉద్యోగితో పరిచయం పెంచుకొని… అతనితో ఏకాంతంగా గడిపిన ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడిందో వివాహిత. లక్షలాది రూపాయలు తీసుకున్నా వేధింపులు ఆపకపోవడం తో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలానగర్లోని గాంధీనగర్కు చెందిన టి.సాయికిరణ్ (29) ఖైరతాబాద్లోని సివిల్ సప్లయి ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. 2022లో ఓ వివాహిత రేషన్ కార్డులో కొడుకు పేరు తప్పుగా పడడంతో సరిచేసేందుకు సివిల్ సప్లయి ఆఫీసుకు వచ్చింది.
అక్కడ తాను సైదాబాద్లో కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నానని, తన భర్త దూరప్రాంతంలో ఉంటాడని చెప్పి సాయికిరణ్తో పరిచయం పెంచుకుంది. అంతటితో ఆగకుండా ఫోన్ నంబరు తీసుకొని తరచూ ఫోన్ చేస్తూ దగ్గరయ్యేందుకు ప్రయత్నించిం ది. ఇరువురి మధ్య సానిహిత్యం పెరగడంతో రెస్టారెంట్లు, ఓయో హోటళ్లకు కలిసి తిరిగారు. ఓ ఓయో గదిలో వారు ఏకంతంగా గడిపిన ఫొటోలు, వీడియోలు తీసుకోవడంతో పాటు ఆ హోటళ్ల రశీదులు సైతం భద్రపర్చుకుంది. వాటి ఆధారంగా తరచూ బ్లాక్మెయిల్కు పాల్పడింది. ఆమె వేధింపులు భరించలేక సాయికిరణ్ 2023లో ఆత్మహత్యకు సైతం యత్నించాడు. విషయంపై అతని తల్లి ఆరా తీయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో కొడుకును తీసుకొని సదరు మహిళను నిలదీసేందుకు వెళ్లగా, దుర్షాషలాడుతూ మరో రూ.50వేలు తన ఖాతాలోకి బదిలీ చేయించుకుంది. 2024 మార్చి 31న తల్లితో కలిసి ఆమె ఇంటికి వెళ్లగా, సైదాబాద్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి అక్కడ మరోసారి బ్లాక్మెయిల్కు పాల్పడి రెండు విడతల్లో రూ.2.50లక్షలు బదిలీ చేయించుకుంది. తాజాగా ఈ నెల 13న సైతం పంజాగుట్ట చౌరస్తాలో కలిసి మరోసారి డబ్బులు డిమాండ్ చేసింది. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే పరువు తీస్తానంటూ బెదిరించింది. దీంతో చేసేదేమి లేక బాధితుడు కుటుంబ సభ్యులతో కలిసి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, ఆమెను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.