Naveen Murder Case | సిటీబ్యూరో, మార్చి 6(నమస్తే తెలంగాణ)/మన్సూరాబాద్ : ప్రేమకు అడ్డొస్తున్న స్నేహితుడు నవీన్ను గుండె చీల్చి.. మొండెం వేరు చేసి అతి దారుణంగా హతమార్చిన హరిహరకృష్ణ, హత్య అనంతరం తన ప్రియురాలికి ఈ విషయం చెప్పి, ఘటన స్థలికి వెళ్లి చూపించినట్లు విచారణలో వెల్లడైంది. మరో స్నేహితుడు కూడా నిందితుడికి పూర్తి సహకారం అందించాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్ధి నవీన్ హత్య కేసులో సోమవారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్న క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుడికి సహకరించిన స్నేహితుడు హస్సేన్, ప్రియురాలు కట్ట నిహారికారెడ్డిని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ మీడియాకు వెల్లడించారు.
గత నెల 17న తన స్నేహితుడైన నేనావత్ నవీన్ నాయక్ (22)ను మోటర్ సైకిల్పై నల్గొండలో విడిచి పెడుతానని తీసుకెళ్లి అబ్దుల్లాపూర్మెట్లోని రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన హరిహరకృష్ణ అతడిని పెద్ద కత్తితో తల, గుండె, మర్మాంగం వేరు చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. హత్య అనంతరం హరి హరకృష్ణ తుర్కయంజాల్, జేఎన్యూఆర్ఆర్ఎం, బ్లాక్ నెం.6/4లో నివాసముండే తన స్నేహితుడైన ప్రబలిటి హస్సేన్ (21) ఇంటికి వెళ్లి నవీన్నాయక్ను హత్య చేసిన విషయాన్ని తెలిపి సహాయం చేయాలని కోరాడు.
హత్య చేసిన రోజు రాత్రి హరిహరకృష్ణ, హస్సేన్ ఇద్దరు కలిసి హత్య చేసిన ప్రదేశానికి వెళ్లి నవీన్నాయక్ శరీర భాగాలను తీసుకుని మన్నెగూడ ప్రాంతంలో వేశారు. ఆ రోజు హస్సేన్ ఇంట్లోనే హరిహరకృష్ణ తలదాచుకున్నాడు. రాత్రి వాట్సాప్ చాటింగ్లో తన ప్రియురాలు నిహారికకు ఈ వివరాలు చెప్పి, మరుసటి రోజు 18వ తేదీన హస్తినాపురం, క్రిస్టియన్కాలనీలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లాడు. హత్య చేసిన విషయాన్ని పూర్తిగా వివరించి, ఆమె వద్ద ఖర్చుల కోసం రూ.1500 తీసుకున్నాడు.
24వ తేదీన హరిహరకృష్ణ పోలీసులకు లొంగిపోవాలనుకున్నాడు. పోలీసులకు లొంగిపోక ముందు హస్తినాపురంలోని నిహారిక ఇంటికి వెళ్లి కలుసుకున్నాడు. అక్కడే స్నానం చేసి, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఆమె సెల్ఫోన్లో ఉన్న వాట్సాప్ చాటింగ్, నవీన్ మృతదేహానికి సంబంధించిన ఫొటోలను, కాల్ డాటాను డిలీట్ చేశాడు. అనంతరం వెళ్లి పోలీసులకు లొంగిపోవడంతో నిందితుడిని 25వ తేదీన అరెస్ట్ చేశారు.
రెండు రోజుల తరువాత 20వ తేదీన హరి హరకృష్ణ నిహారిక వద్దకు వచ్చి ద్విచక్రవాహనంపై ఆమెను తీసికెళ్లి నవీన్ను హత్య చేసిన ప్రదేశాన్ని దూరం నుంచి చూపాడు. అనంతరం ఇద్దరు ఓ రెస్టారెంట్కు వెళ్లారు. రెండు రోజుల అనంతరం నవీన్ శరీరభాగాలను పడేసిన చోటుకు హస్సేన్తో కలిసి వెళ్లి వాటిని సేకరించాడు. తిరిగి హత్య చేసిన ప్రాంతానికి తీసికెళ్లి వాటిలో కొన్ని భాగాలను కాల్చేశారు.
హరి హరకృష్ణను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నామని, ఈ విచారణలో పలు విషయాలు బయటకు వస్తున్నాయని డీసీపీ తెలిపారు. నవీన్ హత్య కేసు ఇంకా కొనసాగుతున్నదని, కస్టడీ ఇంకా పూర్తి కాలేదని ఆమె వివరించారు. ప్రేమ విషయంలోనే నవీన్నాయక్ హత్య జరిగిందని స్పష్టం చేశారు. నవీన్ను కట్ట నిహారిక ప్రేమించిన కారణంగానే హరిహర తట్టుకోలేక హత్య చేసినట్లు విచారణలో వెల్లడవుతుందన్నారు. అయితే నవీన్ను, హరి హరకృష్ణ హత్య చేస్తాడనే విషయం ముందుగా నిహారికకు తెలియదని, హత్య అనంతరం హత్య విషయం ఆమెకు తెలిసిందన్నారు. అయితే హత్య విషయం తెలిసినా దానిని దాచిపెట్టడం కూడా నేరమని, పోలీసులకు సమాచారం ఇవ్వని కారణంగా ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే హస్సేన్ కూడా హతుడి శరీర భాగాలను ఇతర ప్రాంతాల్లో పడవేసేందుకు సహకారం అందించడం, తన ఇంట్లో నిందితుడికి ఆశ్రయం కల్పించడం హత్య విషయం బయటకు చెప్పకపోవడం నేరమని అరెస్ట్ చేశామని డీసీపీ వివరించారు.
దర్యాప్తు కొనసాగుతుందని, ఇతరుల ప్రమేయం ఉంటే వారిని కూడా అరెస్ట్ చేస్తామని డీసీపీ తెలిపారు. నిందితులిద్దరికి వనస్థలిపురం ఏరియా దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ సీఐ వి.స్వామి, ఎల్బీనగర్ సీఐ అంజిరెడ్డి ఉన్నారు.