Cyber Crime | వెంగళరావునగర్, మార్చి 24: ముంబై పోలీసులమంటూ ఓ మహిళను బెదిరించిన నేరగాళ్లు.. ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 98 వేలు దోచేశారు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. వెంగళరావునగర్ కాలనీలో నివాసముండే షెఫాలి పులుగుర్తి (25)కు ఈ నెల 21వ తేదీన ఫెడెక్స్ కొరియర్ పేరిట ఫోన్ కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్పై ముంబై నుంచి ఇరాన్కు ప్యాకేజి బుక్ అయిందని చెప్పారు. ఆ ప్యాకేజీలో ముంబై నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు 50 ఎల్ఎస్డి స్ట్రిప్స్, ఇతర అక్రమ వస్తువులు ఉన్నాయని చెప్పారని తెలిపారు. తాను హైదరాబాద్లో ఉంటానని, ఆ ప్యాకేజిని తాను పంపలేదని షెఫాలి చెప్పినా వారు వినిపించుకోలేదు.
ముంబై పోలీసులకు కాల్ బదిలీ చేస్తున్నట్లు చెప్పి.. కాల్ను బదిలీ చేశారు. ముంబై నార్కోటిక్స్ పోలీసులమని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి విచారించాల్సి ఉన్నదని చెప్పి.. మీ ఫోన్లో స్కైప్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. అనంతరం వీడియో కాల్లో పోలీసు యూనిఫామ్లో ఉన్న ఓ వ్యక్తి ఆమె ఆధార్ కార్డ్ చూపించాలని అడిగాడు. మీ ఆధార్ కార్డ్ వివిధ టెర్రరిస్టుల ఖాతాలకు లింక్ చేసి ఉన్నదంటూ భయబ్రాంతులకు గురి చేశారు. పోలీసు యూనిఫామ్లో ఉన్న వ్యక్తులు, పోలీసు స్టేషన్ మాదిరిగానే కనిపించడంతో బాధితురాలు పోలీసులుగానే భావించింది. దాదాపు 3 గంటల పాటు ఆమె వ్యక్తిగత వివరాలు సేకరించారు.
ఆమె ఖాతాలోని లాగిన్ అవ్వాలని సైబర్ మోసగాళ్లు బెదిరించారు. అనంతరం ఆమె ఫోన్ను స్క్రీన్ షేరింగ్ తీసుకుని.. ఆమెకు తెలియకుండా రూ.3,40,000 ఇన్స్టా పర్సనల్ యాప్ ద్వారా రుణాన్ని తీసుకున్నారు. అనంతరం నిందితులు.. నీ అకౌంట్కు రూ.3,40,000 పంపుతున్నామని, ఆ డబ్బును విడతల వారీగా మేము సూచించిన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. వారు చెప్పినట్లే మొదట విడతగా రూ.98 వేలు బదిలీ చేసింది. ఇంకా డబ్బులు లావాదేవీలు చేసేందుకు ప్రయత్నించగా.. చెల్లింపు నిలిచిపోయింది.
ఆ విషయం మోసగాడికి తెలియజేయగా.. మీ స్నేహితుల నుంచి డబ్బు తీసుకుని పంపాలని ఆమెను బెదిరించారు. అనుమానం వచ్చి ఆమె కాల్ కట్ చేసి.. విచారించగా బాధితురాలికి తెలియకుండానే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.3,40,000 తీసుకున్నారని, వాటినే వారి పంపుతున్నట్లు గ్రహించి మధురానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.