బంజారాహిల్స్, జూన్ 12: రాంగ్రూట్లో రావడమే కాకుండా అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన జీహెచ్ఎంసీ అధికారిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని పార్క్ హయత్ నుంచి కేబీఆర్ పార్కు రోడ్డుపై హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్ నం. 14 వైపు నుంచి లూసిడ్ డయాగ్నస్టిక్స్ మీదుగా రోడ్ నం. 2 వైపునకు ట్రాఫిక్ను అనుమతించకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాగా, గురువారం ఉదయం జీహెచ్ఎంసీ సర్కిల్లో శానిటేషన్ విభాగం ఏఈ ఆనంద్ తన కారులో మరో శానిటరీ ఇన్స్పెక్టర్ అమిత్తో కలిసి రాంగ్రూట్లో వచ్చాడు.
లూసిడ్ సమీపంలో ప్రమాదకరంగా వస్తున్న కారును అక్కడ విధులు నిర్వహిస్తున్న బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలం ఆపాడు. ఈ రోడ్డు వన్వేగా ఉందని, రాంగ్రూట్లో వెళ్లవద్దంటూ సూచించడంతో ఆగ్రహానికి గురైన ఏఈ ఆనంద్ కారులోంచి దిగి మమ్మల్నే అపుతావా..అంటూ దురుసుగా ప్రవర్తించడంతో పాటు కానిస్టేబుల్ మీద దాడికి పాల్పడ్డాడు. దీంతో కానిస్టేబుల్ శ్రీశైలం బంజారాహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏఈ ఆనంద్, శానిటరీ ఇన్స్పెక్టర్ అమిత్లను అరెస్టు చేశారు.