హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): పాకిస్థాన్ సూపర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిజాంపేట్ భండారీ లేఔట్లోని పావని రెసిడెన్సీలో కొందరు బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతున్నట్టు పోలీసులకు సమచారం అందడంతో ఆ ఫ్లాట్లో సోదాలు నిర్వహించారు. నిందితుల నుంచి రూ.20.50 లక్షల నగదుతోపాటు 33 మొబైల్ ఫోన్లు, వైఫై రూటర్, ల్యాప్టాప్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారిలో జీ సత్యపవన్కుమార్, సతీష్రాజు, సీహెచ్ త్రినాథ్, ఎన్ భాస్కర్, జే ప్రసాద్ ఉన్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి ప్రాంతానికి చెందిన సోమన్న అనే వ్యక్తి నుంచి బెట్టింగ్ లైన్ను తీసుకొని వివిధ రకాల యాప్ల సాయంతో బెట్టింగ్లను నడిపిస్తున్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ ముఠాను పట్టుకున్న ఎస్వోటీ డీసీపీ సందీప్, మాదాపూర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్లను సీపీ అభినందించారు. ప్రధాన నిందితుడు సోమన్న పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు.