సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ) : హైటెక్స్లోని ఎగ్జిబిషన్ హాల్లో మూడ్రోజుల పాటు నిర్వహించిన హైదరాబాద్ క్రెడాయ్ పదవ ఎడిషన్ ప్రాపర్టీ షో-2021 ఆదివారం అట్టహాసంగా ముగిసింది. శుక్ర, శని, ఆదివారం జరిగిన ఈ ప్రాపర్టీ షోకు కొనుగోలుదారుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. కొవిడ్ నిబంధనల మేరకు నిర్వాహకులు 100 స్టాల్స్, 1500 ప్రాజెక్టుల వివరాలతో రాష్ట్ర రియల్ ఎస్టేట్ ముఖ చిత్రాన్ని ప్రజల ముందు ఉంచారు. సొంతింటి కల సాకారానికి సందర్శకులు ఇదే మంచి తరుణమని భావించి ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, తదితర వాటిని దక్కించుకునేందుకు ఉత్సాహాన్ని కనబర్చారు. సీనియర్ సిటిజన్స్ మొదలు సకుటుంబ సమేతంగా ప్రదర్శనకు తరలివచ్చారు.
వారంతా రియల్ మార్కెట్ ఎక్కడ బాగుంది..? రాబోయే రోజుల్లో ప్లాట్ల ధరలు ఏ మేరకు పెరుగవచ్చు..? జీహెచ్ఎంసీ లోపల, ఔటర్ బయట రియల్ మార్కెట్ ఎలా ఉందంటూ.. కొనుగోలుదారులు ఆరా తీశారు. ఆకర్షణీయ బ్రోచర్లతో నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు తమ తమ ప్రాజెక్టుల విశిష్టతను కొనుగోలుదారులకు వివరించారు. సామాన్య, మధ్య తరగతి నుంచి ఉన్నతశ్రేణి వర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ రియల్ రంగ సంస్థలు 100 స్టాళ్లలో రూ. 40 లక్షలు మొదలుకొని రూ. నాలుగు కోట్లకుపైగా ఖరీదైన లగ్జరీ ప్లాట్లను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ మూడు రోజుల ప్రదర్శనలో వేల సంఖ్యలో తరలివచ్చిన కొనుగోలుదారులు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఇదే సదావకాశమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ ప్రాపర్టీ షో విజయవంతం అయ్యిందని, 40వేలకు పైగా సందర్శకులు విచ్చేసినట్లు క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వి.రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు వేడుకల్లో ఉత్తమ స్టాల్స్ నిర్వాహకులకు క్రెడాయ్ హైదరాబాద్ జ్ఞాపికలను అందజేసింది. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ శాఖ ఉపాధ్యక్షులు జి.ఆనంద్ రెడ్డి, కె.రాజేశ్వర్, ఎన్.జైదీప్ రెడ్డి, బి.జగన్నాథరావు, కోశాధికారి ఆదిత్య గౌర, సంయుక్త కార్యదర్శులు శివరాజ్ ఠాకూర్, కె.రాంబాబు, పలువురు బిల్డర్లు, డెవలపర్లు తదితరులు పాల్గొన్నారు.