బడంగ్పేట, జనవరి 5: విద్యార్థులను తీర్చిదిద్ది బంగారు భవిష్యత్కు బాటలు వేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా టీఎస్ పీఆర్టీయూ ఆధ్వర్యంలో మండల స్థాయి బోధనోపకరణాల కృత్యాల ప్రదర్శన (టీఎల్ఎం మేళా) కార్యక్రమాన్ని గురువారం జిలెల్లగూడ ప్రభుత్వ స్కూల్(చల్లా లింగెరెడ్డి) మండల విద్యాధికారి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సరూర్నగర్, బాలాపూర్, మహేశ్వరం, కందుకూరు మండలాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పొల్గొని బోధనోపకరణాల కృత్యాలను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రదర్శన కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్రెడ్డి, జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు తో కలిసి ప్రారంభించారు. ఉపాధ్యాయుల ప్రదర్శనలకు సంబంధించి గణితం, సైన్స్ వంటి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఒక అడుగు ముందుకు వేస్తే తమకు కలిగే లాభమేందని అనుకోకుండా టీఎల్ఎం మేళా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఉపాధ్యాయులు విదార్థులను పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నారు. మన ఊరు మన బడి, తొలిమెట్టు కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పెంచేలా ఉండాలన్నారు. విద్యలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలన్నారు. ప్రభుత్వం వందలాది గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు.
పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట జడ్పీ చైర్పర్సన్,తీగల అనితా హరినాథ్రెడ్డి
పాఠశాలలను మెరుగు పరచాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం మన ఊరు, మన బడి కార్యక్రమాన్ని తీసుకువచ్చి అభివృద్ధి చేస్తుందని జడ్పీచైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తారన్నారు. ఉపాధ్యాయులు గుణాత్మకంగా ఉండే విధంగా పాఠాలు బోధించాలన్నారు.
నూతన విధానంలో బోధించాలి : డీఈవో సుశీందర్రావు
నూతన విధానంలో చదువు చెప్పాల్సిన అవసరం ఉందని డీఈవో సుశీందర్రావు అన్నారు. బోధన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు టీఎల్ఎం మేళా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో టీఎస్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి, బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిఫ్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, మీర్పేట మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్, కార్పొరేటర్లు గజ్జెల రామచంద్రం, అనిల్కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రీడింగ్ రూంను ప్రారంభించిన మంత్రి
విద్యకు ప్ర భుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మాదాపూర్లో జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన పబ్లిక్ రీడింగ్ రూం, అలాగే తుక్కుగూడలోని మంఖాల్లో ఏర్పాటు చేసిన రీడింగ్ రూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 80వేల ఉద్యోగాల భర్తీకి దశల వారీగా నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం గ్రామంలోనే చదువుకునేల రూ. లక్ష 50వేల రూపాయల వ్యయంతో పబ్లిక్ రీడింగ్ రూంలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు 5 వేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 10 పీఆర్ఆర్లు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సర్పంచ్ మంద సాయిలు, జాయింట్ కలెక్టరు ప్రతీక్ జైన్, జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు, తుక్కుగూడ వైస్ చైర్మన్ భవానీవెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట్రాం, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు క్రిష్ణరాంభూపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్,బొక్క దీక్షిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.