సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్కు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు వచ్చాయని సీపీ డీఎస్. చౌహాన్ తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ సిబ్బందికి సహాయంగా ఏడు కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు తొలి విడతలో వచ్చాయని వివరించారు. ఈ బలగాలు స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి ఆయా నియోజకవర్గాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తాయన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. శాంతి- భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాత నేరస్థులను బైండోవర్ చేస్తున్నామన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అక్రమంగా నగదు, మద్యం తరలింపు వంటి నేరాలను అడ్డుకోవడంలో భాగంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సరైన పత్రాలు లేకుండా నగదు, నగలు, తదితర వస్తువులు తరలిస్తే సీజ్ చేస్తామన్నారు.