సిటీబ్యూరో, జూన్ 25(నమస్తే తెలంగాణ): ఏటీఎం కేంద్రాల్లో వినియోగదారులు మర్చిపోయిన వైఫై ఎనేబుల్డ్ డెబిట్ కార్డులను సేకరించి.. వాటిలోని డబ్బును కాజేస్తున్న ఇద్దరు నేరగాళ్లను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఏపీ, ప్రకాశం జిల్లా కూచిపూడి గ్రామానికి చెందిన తల్లా శ్రీనివాసులురెడ్డి బీటెక్ పూర్తి చేసి 2017లో హైదరాబాద్కు వచ్చాడు. కేపీహెచ్బీ ప్రాంతంలో నివాసముంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. ఆ సమయంలో ఇతని బంధువైన పిల్లి కొండారెడ్డి హోటల్ మేనేజ్మెంట్ పూర్తిచేసి నగరానికి వచ్చాడు. ఇద్దరు ఒకే రూంలో ఉన్నారు. 2020 సెప్టెంబర్లో ఉద్యోగాల నుంచి బయటకు వచ్చారు. షేక్పేట్లో గదిని అద్దెకు తీసుకొని.. తమ విలాసవంతమైన జీవితానికి కావాల్సిన డబ్బు సంపాదించేందుకు పథకాలు రూపొందించారు.
ఇందులో భాగంగా త్వరగా డబ్బు సంపాదించేందుకు వెంకటేశ్వర కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, శ్రీలక్ష్మి కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ పేర్లపై పేటీఎం నుంచి పీఓఎస్ యంత్రాలను కొన్నారు. ఆ పీఓఎస్ యంత్రాలను కొటక్ మహేంద్ర బ్యాంకులోని ఖాతాలకు లింక్ చేశారు. కూకట్పల్లి, కేపీహెచ్బీ, మాదాపూర్, గచ్చిబౌలి, గోల్కొండ, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనంపై తిరుగుతూ ఏటీఎంల్లో తనిఖీ చేస్తారు. అక్కడ ఆయా బ్యాంకుల వినియోగదారులు వైఫైతో కూడిన డెబిట్ కార్డులను మర్చిపోతే వాటిని సేకరిస్తారు. ఆ కార్డులతో తమ వద్ద ఉన్న పీఓఎస్ మిషన్లలో స్వైప్ చేసి రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు తమ ఖాతాల్లో జమచేస్తుంటారు. చిన్న మొత్తంలో డ్రా చేసినప్పుడు ఆయా కార్డులకు పిన్ నంబర్ అవసరం ఉండదు.
దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. చిన్న మొత్తాల్లో డబ్బు పోవడంతో కార్డుదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రారు. ఇది.. వారిద్దరికి కలిసివచ్చింది. అయితే..తమ కార్డులు పోయాయని, వాటి ద్వారా డబ్బు కూడా డ్రా అయ్యిందని కొందరు బాధితులు కేపీహెచ్బీ, కూకట్పల్లి, రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదుల ఆధారంగా కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు చేసి ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 319 డెబిట్ కార్డులు, రూ. 2.5 లక్షల నగదు, 2 పేటీఎం స్వైప్ మిషన్లు, ఒకటి భారత్ స్వైప్ మిషన్, ఒక బైక్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 310 డెబిట్ కార్డుల నుంచి రూ. 8.37 లక్షలు స్వైప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో శ్రీనివాస్రెడ్డికి చెందిన కొటక్ మహేంద్ర బ్యాంకులో రూ. 6.87 లక్షలు, కొండారెడ్డికి చెందిన సిటీ బ్యాంకు ఖాతాలో రూ. 1.5 లక్షలు జమ అయ్యాయని సీపీ వివరించారు.