కుత్బుల్లాపూర్, ఏప్రిల్16: ప్రజా సంక్షేమంతో పాటు పౌరుల భద్రత కోసమే పోలీస్ వ్యవస్థ నిర్విరామంగా పని చేస్తున్నదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూం, క్రైం వింగ్, మహిళా భద్రత రూంలను ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలంతా పోలీసులకు సహకరించినప్పుడే నేర రహిత సమాజాన్ని నిర్మించేందుకు ఆస్కారం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. పెరిగిన సాంకేతికతను వినియోగించుకుంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి విజయ్కుమార్, బాలానగర్ డీసీపీ పివి.పద్మజ, అడిషనల్ డీసీపీలు కవిత, ఇంద్ర, పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, సీఐ ఎస్.రమేశ్తో పాటు ఎస్ఐలు పాల్గొన్నారు