సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): బెంగళూర్, రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు వేర్వేరు ముఠాలను ఎల్బీనగర్, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరించారు. బెంగళూర్, నీలసంద్ర ప్రాంతానికి చెందిన సయ్యద్ అమీర్ మొహిజ్ స్థానికంగా కార్ డీలర్. మహ్మద్ సాదు, తుక్కు వ్యాపారి. వీరిద్దరు స్నేహితులు. కాగా, నెల్లూరు జిల్లాకు చెందిన పాలెం నివాస్ 2015 నుంచి 2017 వరకు బెంగళూర్లోని రాయ్ టెక్నాలజీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడు. ఆ సమయంలో మహ్మద్ సాదు పరిచయమయ్యాడు. వీరు స్నేహితులుగా మారారు. ఇదిలాఉండగా, బెంగళూర్లో మహ్మద్ సాదు, అమీర్మొహిజ్ కలిసి ప్రతాప్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.5 వేల నుంచి రూ.6 వేలకు గ్రాము చొప్పున హెరాయిన్ కొనుగోలు చేసి, దానిని డ్రగ్స్ వినియోగదారులకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు గ్రాము చొప్పున విక్రయిస్తున్నారు.
750 గ్రాముల ఓపీయం
రాజస్థాన్కు చెందిన రమేశ్ బిష్ణోయ్ జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి జీడిమెట్లలో ఉంటున్నాడు. గత ఐదు నెలలుగా బీఆర్ ట్రావెల్స్లో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అదే రాష్ర్టానికి చెందిన విష్ణు బిష్ణోయ్, సునీల్ దంగా, అర్జున్ రామ్ కూడా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ వ్యాపారాలు, ప్రైవేట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఐదు నెలల కిందట హైదరాబాద్కు వచ్చిన రమేశ్ బిష్ణోయ్కు ఉద్యోగంతో వచ్చే సంపాదన సరిపోవడం లేదు. దీంతో రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి.. హైదరాబాద్లో విక్రయించి డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే 10 రోజుల కిందట రాజస్థాన్కు వెళ్లి, 750 గ్రాముల ఓపీయం, 500 గ్రాముల పప్పీ స్ట్రా పౌడర్ను హైదరాబాద్కు తీసుకొచ్చాడు. మంగళవారం సాయంత్రం నేరేడ్మెట్లోని సునీల్ స్టీల్ రెయిలింగ్ అండ్ ఫర్నీచర్ షాప్ వద్దకు వచ్చారు.
విశ్వసనీయ సమాచారంతో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టి రమేశ్, విష్ణును అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. వినియోగదారులైన సునీల్ దంగా, అర్జున్ రామ్ పేర్లను వెల్లడించడంతో ఆ ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. నలుగురి వద్ద నుంచి రూ. 12.50 లక్షల విలువైన 750 గ్రాముల ఓపీయం, 500 గ్రాముల పప్పీ స్ట్రా పౌడర్, ఇన్నోవా కారు, ద్విచక్ర వాహనం, ఐదు మొబైల్ ఫోన్లు, రూ. 65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు సీపీ సుధీర్బాబు, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లు సుధాకర్, రాములు, నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ నర్సింహాస్వామి, సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం పాల్గొన్నారు.
బావ బామ్మర్దులు..
పాలెం శ్రీనివాస్ బామ్మర్ది వెంకటరంగనాథ చారి కర్మన్ఘాట్లోని మైత్రీపురం కాలనీలో నివాసముంటాడు. అతడిపై గతంలో కేసులు ఉన్నాయి. ఇద్దరు బావ బామ్మర్దులు డ్రగ్స్కు అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే బెంగళూర్కు చెందిన మహ్మద్ సాదు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి, వాటిని వాడటంతో పాటు సరఫరా కూడా చేస్తున్నారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందానికి ఈ సమాచారం అందడంతో సరూర్నగర్ పోలీసులతో కలిసి కర్మన్ఘాట్లోని రంగనాథచారి ఇంట్లో సోదాలు చేశారు. బెంగళూర్కు చెందిన ఇద్దరితో పాటు బావబామ్మర్దులు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.1.5 లక్షల విలువైన 12 గ్రాముల హెరాయిన్తో పాటు నాలుగు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.