సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణకు కొత్తగా 108 స్పెషల్ ట్రాఫిక్ మొబైల్ వాహనాలను ప్రారంభించామని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం నెక్లెస్రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద 108 స్పెషల్ ట్రాఫిక్ మొబైల్ వాహనాలను కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీపీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రతి రోజు నగరంలో సగటున దాదాపు 1250 కొత్త వాహనాలు రోడ్లపైకి అదనంగా వస్తున్నట్లు తెలిపారు.
వీటిని దృష్టిలో పెట్టుకుని నగరంలో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేలా పర్యవేక్షించేందుకు 108 స్పెషల్ ట్రాఫిక్ మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీపీ తెలిపారు. వీటికి పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్, సైరన్, ఫ్లాషింగ్ లైట్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ వాహనాల ద్వారా ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ జామ్ ఉన్న చోటకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తారన్నారు. అంతే కాకుండా నగరంలో టాఫ్రిక్ సమస్యను నివారణకు గత నెల 155 ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, 30 వేల మందికి అవగాహన కల్పించామన్నారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బందితో సీపీ ప్రతిజ్ఞ చేయించారు. నగర అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) పి.విశ్వప్రసాద్ మాట్లాడుతూ స్పెషల్ ట్రాఫిక్ మొబైల్ వాహనాల ద్వారా ట్రాఫిక్ సమస్యలను నివారించడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేసి ప్రజల ప్రాణాలు సైతం కాపాడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్-1 డీసీపీ సుబ్బరాయుడు, ట్రాఫిక్-2 డీసీపీ అశోక్కుమార్, అదనపు డీసీపీలు రంగారావు, శ్రీనివాసచార్యులు, సీపీఆర్ శిక్షణ కల్పించిన అపోలో వైద్యులు డా.ప్రవీణ్రెడ్డి, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.