ముషీరాబాద్, ఆగస్టు 26: ప్రజల సహకారంతోనే నూరు శాతం వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ విజయవంతమవుతుందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ముషీరాబాద్ డివిజన్ కళాధర్నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ నూరు శాతం వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో కళాధర్నగర్ వాసులకు ప్రత్యేక ప్రొత్సాహక సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని 1500 కాలనీలకుగాను 950 కాలనీల్లో నూరు శాతం వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో అన్ని బస్తీల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎక్కడా పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలను సైతం తనిఖీ చేసి పారిశుధ్యం తీరు, కొవిడ్ నిబంధనల అమలుకు తీసుకుంటున్న చర్యలను వాకబు చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకొని అధికారులకు సహకరించాలని కోరారు. ముషీరాబాద్ కార్పొరేటర్ ఎమ్. సుప్రియా నవీన్గౌడ్, సర్కిల్-15 డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ, ఏఎంహెచ్ఓ హేమలత, ముషీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ పద్మజ, డాక్టర్ కృష్ణమోహన్, భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసి హ, ముచ్చకుర్తి ప్రభాకర్, బాబురావు, ఎయిర్టెల్ రా జు, జీ రాజు, లక్ష్మణ్గౌడ్, బీజేపీ నాయకులు ఎమ్. నవీన్గౌడ్, బద్రి, కంచి పాల్గొన్నారు.
చిక్కడపల్లి : వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్లో గడిచిన మూడు రోజుల్లోనే 90వేల మందికి వ్యాక్సిన్ వేశామని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. గాంధీనగర్ డివిజన్ వివేక్నగర్ కాలనీలో వంద శాత వ్యాక్సిన్ పూర్తి చేసిన సందర్భంగా గురువారం మేయర్ విజయలక్ష్మి ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ ఏ పావని వినయ్కుమార్తో కలిసి సర్టిఫికెట్ అందజేవారు. మేయర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్లో ప్రజలందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా గాంధీనగర్ డివిజన్లోని జవహర్నగర్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేటర్ పావనితో కలసి మేయర్ సందర్శించి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.