శ్రీనగర్కాలనీ/ఖైరతాబాద్/హిమాయత్నగర్ , ఆగస్టు 27: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు-10లోని పంచవటికాలనీని శుక్రవారం కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి మేయర్ సందర్శించారు. కాలనీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తికావడంతో స్థానికులను ఆమె అభినందించారు. కమిటీ ప్రతినిధులకు జీహెచ్ఎంసీ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అనంతరం రోడ్డు నంబరు-7లోని ప్రభుత్వ పాఠశాల గదుల్లో రసాయనాల పిచికారీని ఆమె పరిశీలించి, అనంతరం ఇబ్రహీంనగర్లోని వ్యాక్సినేషన్ శిబిరాన్ని వారు సందర్శించారు. గతేడాది కరోనా కారణంగా చనిపోయిన ఉపాధ్యాయులు మాధవి, రాజ్కుమార్ కుటుంబాలను ఆదుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులు ఈ సందర్భంగా మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. బస్తీలు, కాలనీల్లో ముమ్మరంగా చేపట్టిన వ్యాక్సినేషన్ శిబిరాలను స్థానికులు వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, కాలనీవాసులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి సర్వే, వ్యాక్సినేషన్ డ్రైవ్ సోమాజిగూడ డివిజన్లో విజయవంతంగా సాగుతున్నది. కార్పొరేటర్ వనం సంగీత వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రత్యేకంగా పర్యవేక్షించారు.ఇప్పటి వరకు అపరాజిత, దుర్గానగర్, ఆఫీసర్స్, సాదత్ మంజిల్ కాలనీల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు కార్పొరేటర్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం జీహెచ్ఎంసీ ఈఈ చైతన్య, ఏసీపీ రమేశ్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్, పి. నాగరాజు ఉన్నారు.
వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతంగా కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ అధికారులు హిమాయత్నగర్ డివిజన్లోని బస్తీలు, కాలనీల్లో ఇంటింటికీ తిరిగి సర్వే చేసి దాని ఆధారంగా వచ్చిన వివరాల ప్రకారం టీకాలను వేస్తున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఆ ఇంటికి స్టిక్కర్ను అతికిస్తున్నారు.ఇప్పటికే 1150 మందికి టీకాలు వేసి వందశాతం పూర్తైన గాంధీ కుటీర్, ఆదర్శ బస్తీ, విఠల్వాడి,రాజమోహల్లా,వెంకటేశ్వరకాలనీ,ఓల్డ్ కమేలా, లక్ష్మీకాలనీ, రాంకోఠి, బగ్గీ ఖాన బస్తీలకు ప్రశంసా పత్రాలను అందించారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నట్లు అంబర్పేట సర్కిల్-16 డీసీ వేణుగోపాల్, హిమాయత్నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి తెలిపారు.