లక్షణాలుంటే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్సీ)తో పాటు అన్ని ఏరియా దవాఖానలు, జిల్లా దవాఖానలతో పాటు కొన్ని బస్తీ దవాఖానల్లో సైతం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, పొత్తికడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి, కళ్లు నీలిరంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
కుటుంబంలోగానీ.. పనిచేసే చోటగానీ ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే.. తోటివారు కూడా పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా వైరస్ నిర్ధారణ జరిగితే కుటుంబ సభ్యులంతా ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి.. పనిచేసే చోట పక్కపక్కనే కూర్చునేవారు లేదా దగ్గరగా ఉండి కలిసి పనిచేసేవారు, సమావేశాల్లో పాల్గొన్నవారిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే… మూడురోజుల తరువాత తోటివారంతా పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అలా చేయకుంటే వైరస్ సోకిన వ్యక్తి నుంచి తోటివారికి వైరస్ వస్తే.. అది తెలియక వారు వైరస్ను ఇంటికి మోసుకెళ్లి కుటుంబ సభ్యులకు వ్యాప్తిచేసే ప్రమా దం ఉందని అంటున్నారు.
వైరస్ నిర్ధారణ జరిగిన వెంటనే రోగులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. తీవ్ర లక్షణాలుంటే గాంధీ లేదా ఎర్రగడ్డ టీబీ, కింగ్కోఠి, గచ్చిబౌలి టిమ్స్ తదితర ఏదేని దవాఖానలో చేరవచ్చు. లక్షణాలు లేకుండా, స్వల్ప లక్షణాలున్నవారు మాత్రమే హోమ్ క్వారంటైన్లో ఉండాలని, ఒకే గది ఉండి హోమ్ క్వారంటైన్ సౌలభ్యం లేనివారి కోసం అమీర్పేటలోని ప్రకృతి చికిత్సాలయం, ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద దవాఖాన, చార్మినార్ నిజామియా దవాఖానల్లో కరోనా కేర్తో పాటు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. వైరస్ సోకినవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని, క్వారంటైన్ లేదా దవాఖానలో చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. పరీక్షలు జరిపిన చోటనే వైరస్ నిర్ధారణ అయితే.. మందులతో కూడిన మెడికల్ కిట్ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.