అవసరమైతే ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతాం
దవాఖానను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బొల్లారం, మే 12 : కొవిడ్ నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం కంటోన్మెంట్ దవాఖానలో కొవిడ్ చికిత్సా కేంద్రం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని రైల్వే, ఈఎస్ఐ, మిలటరీ, ఎయిమ్స్ దవాఖానల్లో పూర్తి స్థాయి కొవిడ్ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 5వేల రైల్వే కోచ్లు, వివిధ ప్లాట్ ఫాంలలో బెడ్స్ ఏర్పాటు చేసి చికిత్స అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విశ్రాంత ఉద్యోగులు, పారామిలటరీ సేవలను ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. బొల్లారంలోని కంటోన్మెంట్ దవాఖానలో 60 పడకలతో కొవిడ్ చికిత్సలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతామని చెప్పారు. కంటోన్మెంట్ దవాఖానలో ఉన్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా కృషిచేస్తానన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ.. ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, సీఈఓ అజిత్ రెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ రామకృష్ణ, మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ, జంపన ప్రతాప్, స్థానిక నాయకులు జైనపల్లి శ్రీకాంత్, ధనుంజయ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.