శేరిలింగంపల్లి, జనవరి 21: కరోనా మహమ్మారి పంజా విసురుతున్న నేపథ్యంలో శేరిలింగంపల్లిలో రోజురోజుకీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు కరోనా పరీక్షల కోసం ప్రజలు పరుగులు పెడుతున్నారు. గత పది రోజులుగా శేరిలింగంపల్లిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు కలవర పెడుతున్నాయి. శేరిలింగంపల్లి ప్రాథమి ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మొత్తం 211 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 175 మందికి నెగటివ్, 36 మందికి పాజిటివ్ వచ్చింది. రాయదుర్గం పట్టణ ఆరోగ్య కేంద్రంలో 100 మందికి పరీక్షలు నిర్వహించగా, 63 మందికి నెగటివ్, 37 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హఫీజ్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 206 మందికి కరోనా పరీక్ష చేయగా, వారిలో 163 మందికి నెగటివ్, 43 మందికి పాజిటివ్ వచ్చింది. కొండాపూర్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో 347 మందికి పరీక్షలు నిర్వహించగా, 97 మందికి ఆర్టీపీసీఆర్, 250 మందికి రాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించగా, 97 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. శుక్రవారం మొత్తం శేరిలింగంపల్లి ప్రాంతంలో వివిధ ప్రభుత్వ దవాఖానల్లో 864 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 157 మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాంరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా విజృంభిస్తున్న వేళ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని, తప్పకుండా మాస్కులు ధరించాలని, శానిటైజర్ వినియోగించి చేతులను తరుచూ శుభ్రపరుచుకోవాలని పేర్కొన్నారు.