సిటీబ్యూరో, నవంబరు 25 (నమస్తే తెలంగాణ ) : డిసెంబర్ 3వ తేదీన నిర్వహించనున్న కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ డీఈవో అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం బంజారాహిల్స్లోని ఆదివాసీ భవన్లో కౌంటింగ్ సూపర్ వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ డీఈవో అనుదీప్ మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారుల సమక్షంలో కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ నిర్వహించాలని తెలిపారు. కౌంటింగ్ రోజున మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం సూచించిన మేరకు కౌంటింగ్ సూపర్వైజర్లు కేవలం కంట్రోల్ యూనిట్లను మాత్రమే లెక్కించాలని పేర్కొన్నారు.
సూపర్వైజర్లు కౌంటింగ్ సందర్భంగాఫారం-17సి, పార్ట్-1, ఫారం-20లను నమోదు చేయాలని అనుదీప్ సూచించారు. కౌంటింగ్ రోజు సిబ్బంది మొదటగా కంట్రోల్ యూనిట్ల సీలింగ్ను పరిశీలించారు. అనంతరం కంట్రోల్ యూనిట్ ఆన్బటన్ను క్లిక్ చేసి రిజల్ట్ బటన్ ద్వారా ఓట్ల లెక్కింపు అభ్యర్థుల వారీగా ఫారం-17సి, పార్ట్-2లో నమోదు చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపులో భాగంగా ఏమైనా టెండర్ ఓట్లు నమోదు అయినచో వాటిని ప్రత్యేకంగా పరిశీలించి మొత్తం ఓట్ల నుంచి టెండర్ ఓట్లను తీసి వేసి లెక్కించాలని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మైక్రో అబ్జర్వర్లు ర్యాండమ్గా ఐదు పోలింగ్ స్టేషన్ల కంట్రోల్ యూనిట్లను పరిశీలించి ట్యాలీ చేస్తారని అనుదీప్ చెప్పారు. కౌంటింగ్ సిబ్బంది ఫారం-17ఏలో నమోదైన ఓట్ల సంఖ్యను 17-సీ ద్వారా ట్యాలీ చేసుకోవాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన ఆనంతరం సంబంధిత అధికారులు ఫారంలో సంతకాలు చేసి రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని అనుదీప్ తెలిపారు. ఆనంతరం కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్ చేసి బాక్స్లలో అమర్చాలని తెలిపారు.
అభ్యర్థులకు సమాన ఓట్లు నమోదు అయినచో రిటర్నింగ్ అధికారి డ్రా ద్వారా అభ్యర్థిని ఎంపిక చేస్తారని డిప్యూటీ డీఈవో తెలిపారు. కౌంటింగ్ సెంటర్ వద్ద కౌంటింగ్ ఏజెంట్లు 16 మందికి మించకుండా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి రౌండ్ తర్వాత అబ్జర్వర్లు రెండు కంట్రోల్ యూనిట్ల ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేస్తారని చెప్పారు. ఈ సందర్బంగా కౌంటింగ్ సిబ్బందికి కంట్రోల్ యూనిట్ ద్వారా నేరుగా శిక్షణ అందించారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ మంగతాయారు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి వెంకటేశ్వర్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న నియోజకవర్గస్థాయి ఎన్నికల పోలింగ్ సిబ్బంది, సహాయ పోలింగ్ సిబ్బంది శిక్షణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతీ హోళీకేరి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది ఎన్నికల విధులను అత్యంత సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ, వేలికి సిరా చుక్క, ఓటరు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు పరిశీలించటం సహా ప్రక్రియను సమర్థంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి భారతీ హోళీకేరి సూచించారు.