అల్వాల్ ప్రాంతంలో ఓ వివాదాస్పద భూమిలో కోర్టు ఉత్తర్వులు పరిశీలించకుండానే, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ముడుపులు తీసుకున్న అధికారులు అంచనాలు సిద్దం చేశారు. కేవలం రెండు స్తంభాలకు మాత్రమే అంచనా వేసినప్పటికీ ఆ భూమిలో 18 స్తంభాలు, ఎల్టీ లైన్లు అక్రమంగా వేశారు. శాఖాపరమైన నిబంధనల ఉల్లంఘన, విభాగాల మధ్య సమన్వయ లోపం కారణంగా అక్రమంగా స్తంభాలు ఏర్పాటు చేశారంటూ విజిలెన్స్ తేల్చింది. ఇందుకు ఏడీఈ, డీఈ, ఏఈలపై క్రమశిక్షణాచర్యలకు సిఫారసు చేసింది.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ)
విద్యుత్ అధికారుల్లో కొందరు చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. కార్పొరేట్ ఆఫీసులో కొందరు ఉన్నతాధికారులతో ఉన్న సంబంధాలతో తమ పలుకుబడిని ఉపయోగించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు మింట్కాంపౌండ్లో వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఎనిమిది మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసిన సీఎండీ ముషారఫ్ అలీ ప్రస్తుతం మిగతావారి బాగోతంపై దృష్టిపెట్టారని తెలుస్తోంది. సస్పెండ్ అయిన వారితో పాటు వారికి సహకరించిన డీఈలు, ఏఈలు, ఏడీఈలపై మాత్రం ఇప్పటివరకు ఎలాం టిచర్యలు లేవు సరికదా.. వారికి కనీసం మెమోలు కూడా ఇవ్వలేదు. అయితే విజిలెన్స్ విచారణలో తేల్చిన అధికారుల విషయంలో ప్రభుత్వానికి సంబంధించిన ఉపనేత జోక్యంతో చర్యలకు డిస్కం ఉన్నతాధికారులు వెనకడుగు వేస్తున్నారు. గ్రేటర్ శివారు ప్రాంతాలతో పాటు నగరంలోని పలుచోట్ల విద్యుత్ సిబ్బందిలో కొందరు చేస్తున్న అక్రమాల కారణంగా మొత్తం డిస్కంలోనే చర్చ జరుగుతోంది. వినియోగదారులనుంచి ఎవరైనా డిస్కం సిబ్బంది వసూళ్లకు పాల్పడితే వెంటనే ఫిర్యాదు చేయాలంటూ గత ఏడాది యాంటీ బ్రైబరీ సెల్ను డిస్కం ఏర్పాటు చేసి, అందుకోసం 040234 54884,7680901912 హెల్ప్లైన్ నంబర్లు కేటాయించింది. దీనికి సంబంధించి 150 ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలిసింది.
డిస్కం పరిధిలో ప్రతీనెలా కొత్త విద్యుత్ కనెక్షన్లు, మీటర్ల మార్పు, లైన్షిఫ్టింగ్ పనులు, ట్రాన్స్ఫార్మర్ల మంజూరు వంటి అంశాలపై సుమారు 20వేలకు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇందులో చిన్నచిన్న సాంకేతిక అంశాలు సాకుగాచూపి కొంతమంది ఆర్టిజన్లు, లైన్మెన్లు, ఏఈలు, ఏడీఈలు, ఏఏవోలు వాటిని పక్కన పెడుతున్నారు. ఈ సమయంలో కొందరు మధ్యవర్తులు , అధికారుల బినామీలు రంగప్రవేశం చేసి పనిని బట్టి రూ.5వేల నుంచి రూ.5లక్షల వరకు దండుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా పలు డివిజన్లలో అక్రమ నిర్మాణాలకు డబ్బులు వసూలు చేస్తూ విద్యుత్ కనెక్షన్లు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల పేరుతో పాత భవనాలకు కూడా అదనంగా మరో మీటర్ ఇచ్చేందుకు కొందరు సిబ్బంది వినియోగదారులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉంటే అపార్ట్మెంట్లలో ఎవరైనా ఫ్లాట్ కొనుగోలు చేసి దానికి సంబంధించి విద్యుత్ బిల్లులో పేరు మార్చుకోవాలన్నా సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు.
గ్రేటర్ పరిధిలోని పలు సర్కిళ్లలోని డివిజన్లు, సెక్షన్లలో కొందరు అధికారులు, సిబ్బంది ఏళ్ల తరబడి ఒకే స్థానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వారు అక్రమాలకు పాల్పడుతున్నా వీరిపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.మరోవైపు నగర శివారు ప్రాంతాల్లో వేల సంఖ్యలో భవననిర్మాణాలు జరుగుతుండగ కొందరు అధికారులు కొంతమంది ప్రైవేటు విద్యుత్ కాంట్రాక్టర్లతో కలిసి పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యాంటీ బ్రైబరీసెల్కు అందిన ఫిర్యాదులపై విజిలెన్స్ ఎప్పటికప్పుడు నివేదికలిచ్చింది. వాటి ఆధారంగా చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. కేవలం నామమాత్రంగా 8 మందిని సస్పెండ్ చేసి కొంత సీరియస్నెస్ సృష్టించినప్పటికీ మిగతావారిపై చర్యలేవంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈవిషయంలో ప్రభుత్వంలోని ఉపనేత ఆశాఖ ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా అడ్డు పడుతున్నారంటూ సమాచారం. ముఖ్యంగా వారిపై ఆ నేత దగ్గర పనిచేసే సిబ్బందితో పాటు కొందరు డిస్కంలో కీలక పదవుల్లో ఉన్నవారు లక్షల రూపాయల ముడుపులు తీసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది. దీంతో విజిలెన్స్ కూడా తమ పని తాము చేసినా చర్యల విషయంలో తాత్సారం చేస్తున్న ముఖ్య అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.