Congress-BJP | ఢిల్లీ స్థాయిలో జెండాలు-ఎజెండాలు వేరంటూ రాద్దాంతం చేస్తాయి. కానీ గల్లీకొచ్చేసరికి గలీజు రాజకీయాలకు పాల్పడుతాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ను ఎదుర్కొనలేక అసెంబ్లీ స్థాయిలోనే కాదు.. చివరకు స్థానిక సంస్థల పరిధుల్లోనూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాయి. గతంలో అనేక పర్యాయాలు ఇదే రుజువు కాగా.. తాజాగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్-బీజేపీ సిల్లీ చేష్టలు వెలుగు చూస్తున్నాయి.
బీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు రెండు పార్టీలు చీకటి ఒప్పందాలకు తెర లేపాయి. ఈ మేరకు బీజేపీకి చెందిన కార్పొరేటర్లు కాంగ్రెస్కు చెందిన నియోజకవర్గ స్థాయి నాయకుడి వద్దకు వెళ్లి మంతనాలు పూర్తి చేసినట్లు తెలిసింది. సంఖ్యాపరంగా స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సంతకాల సేకరణ దశలో ఉన్న డర్టీ పాలిటిక్స్లో కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు సైతం భారీగానే డిమాండ్ చేస్తుండటంతో నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నది. ఇక్కడ మొత్తం 46 వార్డులు ఉండగా.. ఏకంగా 25 స్థానాలను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకున్నది. బీజేపీకి 14వార్డులు దక్కగా.. కాంగ్రెస్ ఏడు స్థానాలకు పరిమితమైంది. మేయర్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా.. బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో దుర్గ దీప్లాల్ చౌహాన్ మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా బీఆర్ఎస్కు చెందిన తీగల విక్రంరెడ్డిని ఎన్నుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం మారడంతో ఆ ప్రభావం మీర్పేట కార్పొరేషన్పైనా పడింది. కాకపోతే మేయర్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా.. కాంగ్రెస్కు చెందిన ఏడుగురు కార్పొరేటర్లలో ఎస్టీ మహిళ లేకపోవడంతో రెండు జాతీయ పార్టీలు చీకటి ఒప్పందానికి తెరలేపాయి. బీజేపీకి చెందిన కార్పొరేటర్ లీలా రవినాయక్ను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ ఎత్తున పావులు కదిపి, అందులో సఫలీకృతమైనట్లు తెలిసింది.
ఈ మేరకు కాంగ్రెస్కు చెందిన నియోజకవర్గ స్థాయి నాయకుడి దగ్గర మంతనాలు కూడా పూర్తయినట్లు తెలిసింది. కాకపోతే బీజేపీకి చెందిన ఆమెను మేయర్గా చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉండనందున.. మేయర్ పదవి రాగానే కాంగ్రెస్లో చేరేటట్లుగా ఒప్పందం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే తరుణంలో కాంగ్రెస్కు చెందిన భాస్కర్రెడ్డిని డిప్యూటీ మేయర్గా ఎంపిక చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తున్నది.
స్పష్టమైన మెజార్టీ లేనప్పటికీ కాంగ్రెస్ అవిశ్వాసానికి తెర లేపడంతో కార్పొరేటర్లు కాసుల పండుగలా భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీకి చెందిన కార్పొరేటర్లకు రూ.ఐదు లక్షల చొప్పున ఇచ్చేలా ఒప్పందం జరిగిందనే ప్రచారం జరుగుతుంది. అయితే ముందు ఎంత ఇవ్వాలి? తదుపరి ఎంత ఇవ్వాలి? అనే దానిపైనే వీళ్ల మధ్య తర్జనభర్జనలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి నాయకుడు మేయర్ పదవి తరపున ఐదింట నాలుగో వంతు,
కాంగ్రెస్కు చెందిన కార్పొరేటర్ తాను ఆశించే డిప్యూటీ మేయర్ మిగిలిన ఒక వంతు మొత్తాన్ని ఇచ్చేలా కూడా నిర్ణయం జరిగిపోయిందనే ప్రచారం కార్పొరేషన్ పరిధిలో చక్కర్లు కొడుతున్నది. అయితే ఇదంతా ఒక ఎత్తయితే.. రెండు పార్టీలు కలిసినప్పటికీ వీరి సంఖ్యాబలం 21 దగ్గరనే ఆగిపోతుంది. అందుకే సాంకేతికంగా కావాల్సిన మిగిలిన వారి కోసం రెండు పార్టీల తరపున అన్వేషణ సాగుతున్నట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత విరుద్ధమైన పార్టీతో కలవడంతో పాటు మరో పార్టీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తుండటం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.