కరోనా టీకా తీసుకున్నప్పటికీ నియమాలు తప్పనిసరిగా పాటించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. టీకా తీసుకున్నా ఇతర నిబంధనలు పాటించకపోతే ముప్పేనని ప్రముఖ ఫార్మకాలజీ శాస్త్రవేత్త డాక్టర్ రఘురామ్రావు స్పష్టం చేశారు. టీకా తీసుకున్న 28 రోజుల తరువాతనే యాంటిబాడీస్ ఉత్పన్నమవుతాయని, రెండవ డోస్ తీసుకున్న తరువాత మాత్రమే పూర్తిస్థాయి యాంటిబాడీస్ ఉత్పత్తి కావడం జరుగుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని డా.రఘురామ్రావు తెలిపారు. టీకా తీసుకున్నప్పటికీ ప్రజ లు కరోనా నియమాలు తప్పనిసరిగా పాటించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్యాధికారులు డాక్టర్ వెంకటి, డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ మల్లికార్జున్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్లో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా పాఠశాలలు, కళాశాల వి ద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ముఖాలకు మాస్కు లు, బౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయవద్దని, ఫంక్షన్స్, పార్టీలు వంటి వాటిని సాధ్యమైనంత తక్కువ మందితో జరుపుకోవడం లేదా వీలుంటే కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం ఉత్తమమన్నారు. జలుబు, జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు వంటి అనుమానిత లక్షణాలున్నవారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, స్వల్ప, మధ్యస్థ లక్షణాలు గలవారు వైద్యుల సలహాతో హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో బౌతిక దూరం ఉం డేలా విద్యార్థులను కూర్చోబెట్టాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించేలా, చేతులకు శానిటైజర్ వంటి నియమాలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని పాఠశాల, కళాశాల యాజమాన్యాలు, విద్యా సంస్థల అధికారులకు వైద్యాధికారులు సూచించారు. ఎవరికైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యాధికారులకు సమాచారం అందించాలన్నారు. పాజిటివ్ కేసులు బయటపడిన విద్యాసంస్థల్లో ఇప్పటికే విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బందితో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు జరుపుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.