ఒకరిది కలం.. మరొకరిది గళం..
పోలీసు కళాబృందాల్లో రాణిస్తున్న కానిస్టేబుళ్లు
ప్రజా చైతన్య కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రతిభ
ఉన్నతాధికారుల ప్రశంసలు.. ప్రజల అభినందనలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): వారిద్దరూ కానిస్టేబుళ్లు. భద్రత, బందోబస్తు సమయాల్లో తుపాకీతో విధులు నిర్వహిస్తారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఒకరు కలం పట్టారు. మరొకరు గళం విప్పారు. వీరి ప్రావీణ్యాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు సైబరాబాద్ కళాబృందంలో చోటు కల్పించారు. ఇప్పటి వరకు దాదాపు 350 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటు పోలీసు విధులు, అటు ప్రజా అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈ కానిస్టేబుళ్లకు సైబరాబాద్ కళా బృందంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
వాడుక భాషలో 40 పాటలు..
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలానికి చెందిన బొల్ల శ్రీనివాస్ బీఎస్సీ కెమిస్ట్రీ చదివాడు. ఆ తర్వాత పోలీసు ఉద్యోగంలో చేరి ప్రస్తుతం సైబరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్లో ఆర్డ్ రిజర్వ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. 6వ తరగతి నుంచి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా, పాఠశాలలో ఉపాధ్యాయుల వీడ్కోలు కార్యక్రమాల్లో వాడుక భాషలో పాటలు రాసేవాడు. దీనిని గుర్తించిన మాస్టర్ కృష్ణయ్య మరింత ప్రోత్సహించడంతో పాటలు రాయడంలో రాటుదేలాడు. పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత పోలీసు సేవలపై పాట రాసి తోటి ఉద్యోగులను ఆకట్టుకున్నాడు. సైబరాబాద్ కళాబృందం గురించి తెలుసుకుని అందులో చేరి ఆన్లైన్ మోసాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, మహిళలపై అఘాయిత్యాలు, ఈవ్టీజింగ్, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, మూఢనమ్మకాలు వంటిపై వాడుక భాషలో 40 పాటలు రాశాడు. వాడుక భాషలో పాటలు ఉండడంతో ఉన్నతాధికారులు, ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి.
తన గళంతో ప్రజల్లోకి..
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పర్వేడ గ్రామానికి చెందిన వెంకటేశ్ ఎం.ఏ తెలుగు లిటరేచర్ చదివాడు. ఆ తర్వాత పోలీసు ఉద్యోగం సాధించి ప్రస్తుతం సైబరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్లో ఆర్డ్ రిజర్వు కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి సినిమా పాటలు పాడే వెంకటేశ్ కొన్ని సందర్భంలో ఆ సినిమా పాటల మ్యూజిక్కు మాటలు మార్చి పాడడం మొదలు పెట్టాడు. అలా ఆకర్షణీయంగా పాటలు పాడుతున్న వెంకటేశ్కు సైబరాబాద్ కళా బృందంలో అవకాశం కల్పించారు. ఎన్నో కార్యక్రమాల్లో తన పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కృషి చేస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నాడు.