కాప్రా/ఉప్పల్, సెప్టెంబర్ 9: ఏండ్లుగా ఇంటి నిర్మాణ అనుమతులు రాక ఇబ్బంది పడుతున్న ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కాలనీవాసుల చిరకాల కోరిక నెరవేరింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు మోక్షం లభించింది. నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలను పారిశ్రామిక, నివాసేతర జోన్లను ‘నివాస (రెసిడెన్షియల్) జోన్లు’గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మెమో నం. 426/పీఎల్జీ.ఎల్(1)/2022లో ఆయా జోన్లను నివాసజోన్లుగా పరిగణిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉప్పల్ డివిజన్ పరిధిలోని కురుమనగర్, ఉప్పల్ హిల్స్, లక్ష్మీనరసింహ కాలనీ, కల్యాణపురి, మల్లాపూర్ పరిధిలోని వివేకానందనగర్, కేఎల్రెడ్డి నగర్, మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ పరిధిలోని డైమండ్ హిల్స్, న్యూనరసింహనగర్, తిరుమలానగర్ ఎక్స్టెన్షన్ కాలనీలను ఇప్పటి వరకు ఉన్న జోన్ల నుంచి నివాస కాలనీలుగా పేర్కొంటూ అందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది.
ఎన్నో ఏండ్లుగా ఎదురు చూసిన ఆయా కాలనీల ప్రజలు దశాబ్దాలుగా తామెదుర్కొన్న ఇబ్బందుల నుంచి బయట పడటం వల్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇండ్ల నిర్మాణం కోసం అనుమతులు రాకపోవడమే కాకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం, ఇంకా సాంకేతికపరమైన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధులు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసేందుకు ప్రయత్నించినా అవి కార్యరూపం దాల్చలేదు. ఈ జోన్లను నివాస జోన్లుగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పలు దఫాలుగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయా జోన్లను నివాస జోన్లుగా పరిగణిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
జోన్ల కన్వర్షన్ల సమస్య కొలిక్కిరావడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో కాలంగా కన్వర్షన్ ఉత్తర్వుల కోసం ఎదురు చూసిన ఆయా కాలనీల ప్రజల సమస్యలు తీరాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు. కాలనీ సమస్యల పరిష్కారానికి పలుసార్లు మంత్రి కేటీఆర్, అధికారుల దృష్టికి తీసుకువెళ్లా. కాలనీవాసుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం జీఓ జారీ చేయడం హర్షణీయం.
– ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి
కాలనీవాసులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు. ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించింది. తమ నివాసాలు ఇతర జోన్లలో ఉండటంతో ఇంటి అనుమతులు, బ్యాంకు రుణాలు రాక, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇకపై ఆయా కాలనీవాసులకు అనుమతులు, బ్యాంకు రుణాలు మంజూరు కావడంతో పాటు ప్రభుత్వం అభివృది చేస్తుంది. ఆయా కాలనీల ప్రజలు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఉప్పల్