హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్కు అవార్డుల పరంపర కొనసాగుతున్నది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న చర్యల్లో భాగంగా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన విధానాలు అమలవుతున్నాయి. ‘గ్రీన్ సిటీ-క్లీన్ సిటీ’ చర్యలకు గానూ తగిన గుర్తింపు లభించింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 26వ తేదీలలో 28వ కన్వర్జన్స్ ఇండియా 2021, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, ఆరవ స్మార్ట్ సిటీస్ ఇండియా సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ హైదరాబాద్కు మూడు కేటగిరిలో అవార్డులను ప్రకటించాయి. గ్రీన్ అండ్ క్లీన్ సిటీ కేటగిరిలో నాలాల సుందీకరణలో భాగంగా అందంగా తీర్చిదిద్దిన బేగంపేట రెయిన్ గార్డెన్న ఎంపిక చేసింది.. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన పారిశుద్ధ్య నిర్వహణలో మానవ రహితంగా చెత్త సేకరణకు వినియోగించిన వాహనాలను యాంత్రిక విధానంలో పనిచేసేలా చేపట్టిన చర్యలకు గుర్తింపు దక్కింది. రెండవ కేటగిరి అయిన స్మార్ట్ వేస్ట్ డిస్పోజల్ ప్రాజెక్టు కింద ఈ అవార్డును ఎంపిక చేశారు. ఈ విధానం పర్యావరణహితంగా చెత్త సేకరణకు కృషి చేశారని గుర్తించారు. చెత్త సేకరణ కోసం ఇండియాలోనే మొట్టమొదటి సారిగా స్మార్ట్ వెహికల్స్ను వినియోగించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జీహెచ్ఎంసీ ఆదనపు కమిషనర్ సంతోష్, హెచ్ఎండీఏ సెక్రెటరీ బీఎం సంతోష్లు ఈ అవార్డులను అందుకున్నారు.
బేగంపేట రెయిన్ గార్డెన్కు గుర్తింపు
మురికి కూపంగా మారిన నాలాలను దశల వారీగా సుందరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ ఫైలెట్ ప్రాజెక్టుగా బేగంపేట ఫ్లై ఓవర్ దిగువ భాగంగా దాదాపు 40,550 చదరపు మీటర్ల స్థలంలో దాదాపు రూ.1.5 కోట్లతో రెయిన్ గార్డెన్ను చూడముచ్చగా అభివృద్ధి చేశారు. ఈ సుందరీకరణ పనులు చేపట్టి నాలాకు ఇరువైపులా తివాచీ పర్చిన పచ్చదనాన్ని తీర్చిదిద్ది అందంగా తీర్చిదిద్దారు. నాలా మధ్యలో ఉన్న రాళ్ల గుట్టలపై మొక్కలు నాటి, వాటి చుట్టూ ఇరువైపులా నడిచేలా వంతెనలు నిర్మించడం, విభిన్న అకృతులతో రెయిన్ గార్డెన్ను ఏర్పాటు చేశారు. క్యానా, అంబ్రెల్లా గ్రాస్, టైఫా, మూ సా వంటి మొక్కల్ని నాటారు. నాలాకు ఇరువైపులా గల ప్రాంతాన్ని తివాచీ పర్చిన పచ్చదనం కనువిందు చేస్తున్నది. వ్యర్థాలను తీసేసి, అలంకరణ చెట్లు, వాకింగ్ ట్రాక్, ఇతరత్రా సుందరీకరణ పనులు ఆకట్టుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో బిగించిన అత్యాధునిక లైట్ల వెలుగులు కనువిందు చేస్తున్నాయి.
పారిశుద్ధ్య నిర్వహణలో..
నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చెత్త సేకరణకు జీహెచ్ఎంసీ యాంత్రిక విధానాన్ని అవలంభించారు. దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానం ఆమలు చేస్తున్నారు. ఆధునిక పద్ధతిలో 60 సెకండరీ కలెక్షన్స్, ట్రాన్స్ఫోర్టు పాయింట్లను (ఎస్సీటీపీ)లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల నుంచి మున్సిపల్ వ్యర్థాలను తరలించేందుకు 35 జీవీడబ్ల్యూ సామర్థ్యం గల 55 బెంజ్ వాహనాలను, 61 పోర్టబుల్ సెల్ప్ కంప్యాక్టర్లు, 16 హై కెపాసిటీ ఆటోమేటెడ్ స్టాటిక్ కంప్యాక్టర్లు, 65 హై కెపాసిటీ సీల్ట్ కంటైనర్లను జీహెచ్ఎంసీ సమకూర్చింది. చెత్త రవాణాలో వినియోగించే వాహనాల స్మార్ట్ వినియోగంపై ‘స్మార్ట్ వేస్ట్ మేనేజ్మెంట్’లో ఈ గుర్తింపు లభించింది.