గౌతంనగర్,ఏప్రిల్ 22 : మంత్రి కేటీఆర్ చొరవతోనే మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణ భూ నిర్వాసితులకు గురువారం ఆయన నివాసంలో చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణలో స్థలాలను కోల్పోయిన వారందరికీ రెండవ విడుతలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.కోటి 94లక్షల రూపాయల చెక్కులను అందించామని తెలిపారు. భూ నిర్వాసితులకు రూ.3.55కోట్ల నష్ట పరిహారంలో భాగంగా మొదటి విడుతలో కొంత చెల్లించామన్నారు. దాదాపుగా 17 సంవత్సరాలుగా ఉన్న సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించామని, కమాన్ ఇరువైపుల రోడ్డు వైడింగ్ పనులు పూర్తి చేశామని త్వరలోనే కమాన్ గుండా బస్సు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు.