సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : దూర విద్యా కోర్సులలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఎప్పుడైనా.. ఎక్కడైనా.. నిరంతరాయంగా పాఠాలు వినడం కోసం బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఓ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ సీతారామారావు ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతున్నాయి. దూర విద్యా విధానంలో రేడియో పాఠాలు విద్యార్థులకు 24 గంటలు నిరంతరాయంగా అందించడం బహుశా దేశంలో ఇదే తొలి సారి అవుతుందని వర్సిటీ వైస్ చాన్స్లర్ అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీకి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ) ద్వారా వెబ్ రేడియో నిర్వహణ బాధ్యతలు కొనసాగుతాయన్నారు. వెబ్ రేడియో ద్వారా యూజీ, పీజీ స్థాయి విద్యార్థులందరికీ పాఠాలు అందుబాటులోకి తెస్తున్నారు. అయితే స్మార్టు ఫోన్లు, డెస్క్టాప్, ల్యాబ్టాప్లతో పాటు ట్యాబుల ద్వారా కూడా వెబ్ రేడియో పాఠాలు అందుబాటులోకి తీసుకుస్తున్నట్లు సీతారామరావు తెలిపారు.
అన్ని రకాల పాఠాలు నిరంతరాయంగా, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ విద్యార్థులు వినే విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అర్థమయ్యేంత వరకు పదే పదే వినడానికి అవకాశం ఉంటుందని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.