సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండడంతో మహమ్మారి బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న కుటుంబాలను కరోనా మరింత కష్టాల్లోకి నెట్టుతోంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మేమున్నామంటూ సేవామూర్తులు అండగా ఉంటున్నారు. కొంతమంది విరాళాలు, అన్నదానాలతో చేయూతనిస్తుంటే.. మరికొందరు సేవ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆపత్కాలంలో ఒకరికి మరొకరు అండగా ఉండాలనే స్ఫూర్తిని రగిలిస్తూ భరోసా ఇస్తున్నారు. ఉన్నంతలో సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా పెరుగుదలతో మందులు, నిత్యావసరాలు చాలా కీలకం. సమయానికి అందడం వల్ల ప్రాణాపాయం తప్పుతుంది. ఏ సమయంలోనైనా హెల్ప్ చేస్తామంటూ కొంతమంది యువకులు, సంస్థలు అభయమిస్తున్నాయి. వీరి సేవలకు ప్రశంసలు లభిస్తున్నాయి. కరోనా మొదటి దశ నుంచి ఇప్పటివరకు వీరి సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతుండడం విశేషం.
గ్రూపుల్లోనే అంతా..
సమాచారం అంతా సోషల్ మీడియా గ్రూపుల్లోనే పంచుకుంటున్నారు. ఏ ప్రాంతంలో ఎలాంటి సహాయ కార్యక్రమాలు నిర్వహించాలో ఉదయాన్నే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆయా ప్రాంతాలకు చెందిన వారిని బాధ్యులుగా నియమిస్తూ అవసరమైన వస్తువులను అక్కడికి చేర్చుతున్నారు. అలా వారు సంబంధిత ప్రాంతంలో వాటిని బాధితులకు అందజేస్తున్నారు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సహాయం చేయడానికి వీలుకాని వాళ్లు..కొన్ని ఎన్జీవోలకు తమ గ్రూపు తరపున డబ్బులు సహాయంగా అందిస్తున్నారు. ఇంట్లో ఉంటూ పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేయడంలో టెక్నాలజీది ప్రధానపాత్ర అని చెప్పొచ్చు. క్షణాల్లో తమ సేవా కార్యక్రమాల వివరాలు వందలాదిమందికి తెలియజేయడం, అతిథులను ఆహ్వానించడం జరిగిపోతుంది. మొత్తానికి కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రజలందరూ దూరంగా ఉంటూనే.. సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ సేవలు అందించడంలో సఫలమవుతున్నారు.
మేమున్నాం.. నిశ్చింతగా ఉండండి
కరోనాతో బాధపడేవారు కుంగిపోవాల్సిన అవసరం లేదు. రేషన్ సరుకులు, మందులు, భోజనం లాంటి అవసరాలు వెంటనే తీరుస్తాం. కుంగిపోకుండా ధైర్యంగా కరోనాను ఎదుర్కోవాలి. గతంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడు మళ్లీ కరోనా కలవరం రెట్టింపు అవుతుంది. సాయం కావాల్సిన వారు 8886990000 కు ఫోన్చేస్తే మా టీం సాయం అందిస్తుంది.
ఇంటికే మందులు
కరోనాతో బాధపడేవారు బయటకు వెళ్లి మందులు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయలేరు. వృద్ధులు కూడా కరోనా సమయంలో బయటకు రావాలంటే భయపడుతుంటారు. అలాంటి వారికి ఎలాంటి అవసరం ఉన్నా మేం అండగా ఉంటాం. మాకు కాల్ చేసి అడ్రస్, కావాల్సిన వస్తువులు, సరుకుల పేర్లు చెబితే చాలు మేం వాటిని ఇంటికి చేరుస్తాం. అవసరమున్న వారు 9701744814 కు కాల్ చేస్తే పంపిస్తాం.
అధైర్యం వద్దు
కరోనా భయంతో హడలిపోతున్న వారిలో మనోైస్థెర్యాన్ని నింపేందుకు హెల్పింగ్ స్పాట్ అండగా నిలుస్తుంది. కాల్ చేస్తే చాలు ఉచితంగా భోజనం అందించనుంది. 888668600 నంబర్కు కాల్ చేసి వివరాలు చెబితే సాయం అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ప్రతీరోజు వందమందికి పైగా భోజనాలు అందిస్తున్నాం. చేతనైనంతలో ఆపదలో ఉన్నవారికి సహాయం అందించాలి.
-భార్గవ్, ఫౌండర్,హెల్పింగ్ స్పాట్ ఫౌండేషన్