సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): నాసిరకం కూలర్ అమ్మినందుకు క్రోమా, సింపొనీలకు వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. వినియోగదారుడికి రూ.5వేల నష్టపరిహారంతో పాటు రూ. రెండు వేలు ఖర్చుల కింది అందజేయాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు కె.రామ్మోహన్తో కూడిన బెంచ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. న్యూబోయిన్పల్లికి చెందిన ఎస్వీఎస్ఎస్ రామచంద్ర సికింద్రాబాద్ క్రోమా కంపెనీ నుంచి సింపొని ఎయిర్ కూలర్ను మార్చి 2021లో రూ.14,650కి కొనుగోలు చేశాడు.
వారంటీ కార్డుతో పాటు సాధారణ కిట్ను వినియోగదారుడికి అందజేయలేదు. అయితే, కూలర్ సరైన విధంగా కూల్ కాకపోవడం, ఎక్కువగా శబ్దం రావడం, టైమర్ బటన్ కూడా పనిచేయకపోడంతో వినియోగదారుడు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. సంబంధిత టెక్నీషియన్ వచ్చి మరమ్మతు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో, వినియోగదారుడు క్రోమా షోరూంతో పాటు తయారు కంపెనీపై వినియోగదారుల కమిషన్-1లో కేసు వేశారు. పూర్వపరాలను పరిశీలించిన కమిషన్ బాధితుడికి నష్టపరిహారం కింద రూ.5వేలతో పాటు ఖర్చుల కింద మరో రెండు వేలు చెల్లించాలని బెంచ్ ఆదేశించింది.