సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఎయిర్పోర్టు మెట్రో మార్గం నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుధవారం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజినీర్లతో కలిసి ఔటర్ రింగు రోడ్డు వెంట ఉన్న రాజేంద్రనగర్ కొండపై సుమారు 1.3 కి.మీ పొడవుగల విమానాశ్రయ మెట్రో అలైన్మెంట్ను పరిశీలించారు. నిటారుగా ఉండే ఎత్తులు, బండరాళ్లు మరియు లోయలు ఉన్న ఈ కొండపై విమానాశ్రయ మెట్రో వయాడక్ట్ నిర్మాణం చాలా కష్టమైన పని అని గుర్తించారు. నిటారుగా ఉన్న వాలులు, బండరాళ్లను అధిరోహిస్తూ ఎన్వీఎస్ రెడ్డి ప్రతిపాదిత అలైన్మెంట్ను పరిశీలించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మెట్రో ఎండీతో పాటు ఎయిర్పోర్టు మెట్రో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జీఎం యం.విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్.ఈ వై.సాయప రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ (రైల్వే) జెయన్ గుప్తా, ఇతర సీనియర్ అధికారులు మెట్రో మార్గాన్ని నడుచుకుంటూ వెళ్లి తనిఖీ చేశారు.