బంజారాహిల్స్,మార్చి 16: జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని బస్తీలు, కాలనీల్లో పాడైన రోడ్ల స్థానంలో కొత్త రోడ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల సీవరేజ్ లైన్పనులు పూర్తయిన ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేస్తుండడంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పాడైన రోడ్ల స్థానంలో వీడీసీసీ రోడ్లు వేస్తున్నారు. ఫిలింనగర్లోని గౌతమ్నగర్ జంక్షన్లో రూ.19.2లక్షల వ్యయంతో 120మీటర్ల మేర వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ఫిలింనగర్లోని పలు బస్తీలకు సంబంధించిన ప్రధాన కూడలిగా ఉన్న ఈ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో కొత్త రోడ్డు వేస్తున్నారు. దీంతో పాటు ఛత్రపతి శివాజీనగర్ బస్తీలో రూ.10లక్షల వ్యయంతో వీడీసీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల, కమలాపురి కాలనీ-సాగర్ సొసైటీ రోడ్డుపై పెండింగ్లో ఉన్న వీడీసీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. రూ.46.5లక్షల వ్యయంతో ఈ పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కమలాపురి కాలనీ రోడ్డు పనులు పూర్తయితే సాగర్ సొసైటీ మీదుగా కృష్ణానగర్ ప్రధాన రహదారికి వెళ్లే వాహనాలకు సౌకర్యంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. వీటితో పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 86, 35లో రూ.35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో రెండు చోట్ల రూ.34లక్షల వ్యయంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.
డివిజన్ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 44లో రూ.28 లక్షల వ్యయంతో రోడ్డుపనులకు టెండర్ ఖరారయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 70లోని జర్నలిస్ట్కాలనీలో రూ.48లక్షల వ్యయంతో రోడ్డు పనులకు టెండర్ ఖరారైంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని ఇందిరానగర్, జవహర్నగర్ ప్రాంతాల్లోని పలు వీధుల్లో సీసీ రోడ్డు పనులకు సంబంధించి రూ.1.2కోట్ల వ్యయంతో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించిన టెండర్లను ఖరారు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఫిలింనగర్లోని వినాయక్నగర్, జ్ఞానీజైల్సింగ్నగర్, స్వామివివేకానంద్నగర్, రోడ్డు నంబర్ 9 అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.65 లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటికే టెండర్లకు పిలవగా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో మరోసారి టెండర్లను పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల రోడ్డుతో పాటు కమలాపురి కాలనీలో ఒకే ప్యాకేజీగా పనులు ప్రారంభించాం. ఎమ్మెల్యే దానం ఆదేశాలతో బస్తీల్లో రోడ్లను త్వరితగతిన పూర్తిచేయాలని ప్రయత్నిస్తున్నాం. నిర్దేశిత సమయంలో పనులను ప్రారంభించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. కొత్తగా పనులను ప్రారంభించడంతో పాటు టెండర్లు ఖరారైన వెంటనే పనులు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం.
-హరేరామ్, డీఈ, జీహెచ్ఎంసీ సర్కిల్-18