కొండాపూర్, మే 24 : నకిలీ పత్రాలు సృష్టించి నిర్మిస్తున్న ఆరంతస్తుల భవన నిర్మాణాన్ని శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధి రాజరాజేశ్వరి నగర్ కాలనీలోని 147 ప్లాట్ నంబర్లో ఉన్న 300 గజాల స్థలం నానిశెట్టి ప్రమీల పేరుతో ఉంది. ప్రమీల మరణించడంతో సదరు బిల్డర్ ప్రమీల సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను తయారు చేశారు.
సృష్టించిన పత్రాలతో గోల్కొండ రమేశ్ పేరిట జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో స్టిల్ట్ ప్లస్ 3 భవన నిర్మాణ అనుమతులు తీసుకుని నిర్మాణాన్ని ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న ప్రమీల కుటుంబ సభ్యులు కూకట్పల్లి కోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన కోర్టు సదరు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ సదరు బిల్డర్ నిర్మాణ పనులు కొనసాగిస్తుండడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 20న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు, గచ్చిబౌలి పోలీసుల బందోబస్తు మధ్య శనివారం సదరు భవనాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన వారిలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకట రమణ, టీపీఎస్ సంతోష్ కుమార్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్, తదితరులు ఉన్నారు.