కంటోన్మెంట్, అక్టోబర్ 17: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం కంటోన్మెంట్ బాలంరాయిలోని లీ ప్యాలెస్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ మ్యానిఫెస్టోను చూసి ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో పదేండ్లు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాలించి దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయన్నారు.
లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజు దేశానికి అప్పుల భారం పట్టి పీడిస్తోందన్నారు. వార్డులతో పాటు డివిజన్కు చెందిన నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కలిసి పనిచేసి యువ మహిళా నాయకురాలు లాస్యనందితకు భారీ మెజార్టీ కట్టబెట్టాలన్నారు. అంతకుముందు దివంగత ఎమ్మెల్యే సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథం, నళినికిరణ్, అనితాప్రభాకర్, భాగ్యశ్రీ శ్యామ్కుమార్, మార్కెట్ చైర్మన్ హారికా, వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్రెడ్డి, కో-ఆప్షన్ మాజీ సభ్యులు నర్సింహ ముదిరాజ్, పాలకమండలి సభ్యులు దేవులపల్లి శ్రీనివాస్, భాస్కర్ ముదిరాజ్, రామకృష్ణ, నారాయణ, నేతలు టీఎన్ శ్రీనివాస్, ప్రభుగుప్తా, హరికృష్ణ, తేజ్పాల్, ఉమేష్, పనస సంతోష్, సదానంద్గౌడ్, మురళీయాదవ్, వంగాల మల్లేష్, కిరణ్కుమార్, సరిత, ఉమాశంకర్, రంగా రవీందర్గుప్తాతో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కంటోన్మెంట్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. సమావేశంలో ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, కార్యకర్తల ఆత్మీయ ఆలింగనాలతో సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది. వార్డుల వారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ‘ప్రగతి నివేదిక’ సిద్ధం చేసి ఇంటింటికీ పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులను ముఖ్య నేతలు కోరారు. నేతలు, పార్టీ శ్రేణులంతా ఒకే కుటుంబంలా ఉండాలని పిలుపునిచ్చారు. సాయన్న మరణం తరువాత పార్టీ శ్రేణులంతా ఒకే వేదికపై కలవడం జరిగిందన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ పోలింగ్ లోపు కనీసం మూడుసార్లు వెళ్లాలని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్ పిలుపునిచ్చారు. నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ ఇతరత్ర పనులు పక్కన పెట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. ప్రతి వార్డులో ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు పార్టీ వార్డు, డివిజన్ అధ్యక్షుడు, కార్యకర్తలను కలుపుకోవాలన్నారు. ప్రతి బూత్ను సందర్శించి ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని కోరాలని సూచించారు.
– గజ్జెల నాగేష్, చైర్మన్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్
మీ ఇంటి బిడ్డను, సాయన్న కూతురిని, కేసీఆర్ అభ్యర్థినిగా మీ ముందుకు వస్తున్నా……తనను మీరందరూ ఆశీర్వదించాలని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ మనపై పెద్ద బాధ్యత పెట్టినాడు. అందుకే మీరందరూ నన్ను గెలిపిస్తే కడుపులో పెట్టి చూసుకుంటానన్నారు. మీరు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, ఈ అవకాశాన్ని మనందరం తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని నాయకత్వంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రతి గడపకు చేరే విధంగా నాయకుడు, కార్యకర్త ముందుకుసాగాలన్నారు. ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగే మ్యానిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. రూ.1,200 ఉన్న గ్యాస్ సిలిండర్ను రూ.400కే ఇస్తామని, సౌభాగ్యలక్ష్మి పథకం పేద మహిళలకు రూ.3 వేలు ఇచ్చే కార్యక్రమం మహిళలు సంతోషపడే విధంగా మ్యానిఫెస్టో ఉందన్నారు.
– జి. లాస్యనందిత, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, సికింద్రాబాద్ కంటోన్మెంట్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని శ్రేణులకు సూచించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణతో పాటు కంటోన్మెంట్ బోర్డుకు చేసిందేమీ లేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసిందన్నారు. వార్డుల్లోని నాయకులు పోటీతత్వంతో పనిచేసి మెజార్టీని పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.
– జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్