మలక్పేట, మే 4 : ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మానసికంగా కుంగిపోయిన ఓ కానిస్టేబుల్ గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని బాలదానమ్మ బస్తీలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ బాలాజీనగర్కు చెందిన బానోతు రేణుక, భిక్షం నాయక్ కుటుంబం 30 ఏండ్ల కిందట నగరానికి వచ్చి మూసారాంబాగ్లోని బాలదానమ్మ బస్తీలో స్థిరపడింది. వీరి కుమారుడు అభిలాష్ నాయక్కు పదేండ్ల కిందట ఇంద్రజ్యోతితో వివాహం జరుగగా.. వీరికి ధీరజ్, హేమంత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2014లో పోలీస్ ఉద్యోగానికి ఎంపికైన అభిలాష్ నాయక్, ఆరేండ్లుగా మాదన్నపేట పీఎస్లో కానిస్టేబుల్(పీసీ 1748)గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండురోజుల కిందట భార్యా పిల్లలను కోదాడలో వదిలివచ్చాడు. రోజుమాదిరిగానే సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి చేరుకున్నాడు.
భోజనంచేసిన అనంతరం రెండో అంతస్తులో పడుకుంటానని తల్లికి చెప్పి వెళ్లాడు. రాత్రి ఎనిమిది గంటలకు విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్న అతడి తమ్ముడు ప్రభునాయక్కు తల్లి రేణుక అన్నను లేపుకొని రమ్మని చెప్పింది. అతడు రెండో అంతస్థుకు వెళ్లి చూడగా తలుపులకు లోపలివైపు గడియపెట్టి ఉంది. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో విషయాన్ని తల్లి రేణుకకు చెప్పి, అశోక్ అనే యువకుడి సహాయంతో తలుపులు పగులగొట్టాడు. లోపలికి వెళ్లి చూడగా అభిలాష్నాయక్ రక్తపు మడుగులో విగత జీవిగా పడివున్నాడు. సమాచారం అందుకున్న మలక్పేట ఎస్ఐ సుభాష్ మృతదేహాన్ని పరిశీలించగా, బ్లేడ్తో గొంతు కోసుకున్నట్లు గుర్తించారు. మృతుడి తల్లి రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కోదాడకు తీసుకెళ్లారు. కాగా అభిలాష్ నాయక్ కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడని మృతుడి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.