మేడ్చల్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి దుష్ట, దుర్మార్గపు పోకడలకు తెర లేచినట్టు అయ్యింది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని శివారు ప్రాంత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుత మేయర్లు, మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్ తెర లేపుతోంది. ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలలో అధికారమే లక్ష్యంగా అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు జోరుగా చేస్తుంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో 13 మున్సిపాలిటీలు ఉండగా, ఇందులో 13 మున్సిపాలిటీలను అప్పట్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మున్సిపాలిటీల పాలకవర్గం పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి నాటికి ముగియనుంది. అయినప్పపటికి మున్సిపాలిటీలలో అధికారం పొందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసుత్తం ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను చిల్చే విధంగా వారిపై ఒత్తిడి తెస్తున్నారు. అంతే గాక వారిని ప్రలోభాలకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వివిధ మున్సిపాలిటీల పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానాలకు తెర లేపగా జవహర్నగర్ కార్పొరేషన్ బీఆర్ఎస్ మేయర్ కావ్యపై అవిశ్వాసం నెగ్గిన విషయం తెలిసిందే.
త్వరలోనే రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి అవిశ్వాస తీర్మానాలు కాంగ్రెస్ చేస్తుందన్న ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. ప్రసుత్త ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అప్పటి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శివారు ప్రాంత మున్సిపాలిటీల్లో ఒక్క మున్సిపాలిటీనైనా కాంగ్రెస్ పార్టీ గెలువలేక పోయింది. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియెజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని గెలుపొందాలంటే కాంగ్రెస్ పార్టీకి కష్ట సాధ్యమైన పనిగా మారింది. పార్లమెంట్ పరిధిలో బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నందున మున్సిపాలిటీల పాలకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను చీల్చి కాంగ్రెస్ వైపు లాక్కొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు ఎమ్మెల్యేలైన చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద్, మర్రి రాజశేఖర్రెడ్డి, మాధవరం కృష్ణారావు, సుధీర్రెడ్డి, లాస్య నందితలు భారీ మెజార్టీలతో గెలుపొందిన క్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందన్న సంకేతాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని, ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలకు మరో 10 నెలలు మాత్రమే గడువు ఉన్నప్పటికీ అవిశ్వాస తీర్మానాలు కాంగ్రెస్ పెట్టించడంతో మున్సిపాలిటీలలో పరిపాలన సరిగా సాగడం లేదన్న ఆరోపణలను కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. అవిశ్వాస తీర్మానాలకు తెర లేపిన నేపథ్యంలో క్యాంపుల పేరిట స్థానికంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉండలేక పోతున్నారు.