హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆగడాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది. ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ను బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. వారం పది రోజుల్లో ఆయనపై వేటు పడే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తలు పార్టీలో హల్చల్ చేస్తున్నాయి.
పలువురు సీనియర్లు కూడా ఈ వార్తలను బలపరుస్తున్నారు. రేవంత్రెడ్డి, ఠాగూర్ వ్యవహారంపై ఇప్పటికే సీనియర్లతోపాటు ఇతర నేతల నుంచి అధిష్ఠానానికి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో ఈ ఇద్దరి వ్యవహారశైలిపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ మధ్యకాలంలో వీరిద్దరి ఆగడాలు మరింత పెరిగిపోవడంతో ఇక ఉపేక్షించొద్దనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే తొలుత రాష్ట్ర ఇన్చార్జి ఠాగూర్ను తప్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
మాణిక్కం ఠాగూర్ డబ్బులు తీసుకొని రేవంత్రెడ్డికి పీసీసీ పదవి అప్పగించారంటూ ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోపాటు ఇతర నేతలు బహిరంగంగానే ఆరోపించారు. ఈ ఇద్దరు కలిసి సీనియర్లను సాగనంపేందుకు కంకణం కట్టుకున్నారనేది ప్రధాన ఆరోపణ. మాణిక్కం, రేవంత్ ఆగడాలు, పార్టీకి జరుగుతున్న నష్టంపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ ప్రధాన నేత ప్రియాంక గాంధీనే రంగంలోకి దిగనున్నట్టు తెలిసింది.