ముషీరాబాద్ ( హైదరాబాద్ ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాట మారుస్తూ నిరుద్యోగులను మోసం చేస్తుందని బీసీ సంక్షే సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (R. Krishnaiah) ఆరోపించారు. మొత్తం 26 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఐదువేలు, పదివేల ఉద్యోగాలంటూ మోసపూరిత నాటకానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. బుధవారం విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యాశాఖలోని కొంత మంది అధికారుల మాటలు నమ్మి ప్రభుత్వం గుడ్డిగా ముందుకు వెళ్తుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే టెట్(TET) నిర్వహించి, పూర్తి స్థాయిలో టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ నేత ప్రధానిగా ఉండి కూడా వెనకబడిన వర్గాలకు అన్ని రంగాల్లో తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్(BC Reservations) లు, సమాన వాటా కోసం దశాబ్దాలుగా పోరాటం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా మోసం చేస్తుందని మండిపడ్డారు.
అన్ని వర్గాలు ఆరాధించే రాముడిని తమ వాడు అన్నట్లు దేవుడిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, 60 శాతం బీసీలు పేదరికంలో మగ్గుతుంటే వికసిత భారత్ అంటూ ఊదరగొడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు అన్ని రంగాల్లో సమాన వాటా, చట్టసభల్లో, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు, కులగణన చేపడతామని అన్ని పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చాలని డిమాండ్ చేశారు.